హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హకుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడమనే ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను దేశ స్వాతంత్య్రోద్యమంలో లక్ష్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ, అన్ని కాలాలకూ ఆదర్శనీయమైనదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి గాంధీజీ అని అభివర్ణించారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలతో విజయం సాధించి చూపడం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను పరిచయం చేశారని సీఎం కొనియాడారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకొనే స్థాయి కలిగిన మహాపురుషుడు మహాత్మాగాంధీ అని పేరొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ‘గుంపులో ఒకరిగా ఉండడం తేలికే కానీ ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి’ అన్న గాంధీ మాటలే ప్రేరణగా తెలంగాణ రాష్ట్రం హకుల సాధనకోసం ముందడుగు వేస్తున్నదని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.