హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాబోరని పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకొనడానికి నాలుగు ప్రధాన కారణాలున్నట్టు అవి వివరించాయి. సోకాల్డ్ జాతీయ పార్టీలుగా పేర్కొంటున్న కాంగ్రెస్, బీజేపీల విషయంలో తమ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. ఆ రెండింటికీ సమాన దూరంలో ఉంటామని విస్పష్టంగా వెల్లడించారు. ఢిల్లీలో సమావేశ నిర్వహణకు చొరవ తీసుకొన్న పార్టీ అగ్రనేతలకు కూడా టీఆర్ఎస్.. నాలుగు రోజుల ముందే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఇంత చెప్పినా..
తృణమూల్ ముఖ్యనేతలు టీఆర్ఎస్ వర్గాలను సంప్రదించినప్పుడు ఎటువంటి శషభిషలు, సంకోచాలు లేకుండా కాంగ్రెస్ను ఈ మీటింగ్కు దూరంగా ఉంచాల్సిందే.. అప్పుడే తాము హాజరు కాగలుగుతామని టీఆర్ఎస్ విస్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పాల్గొనే ఏ సమావేశానికి తాము రాబోమని, అందువల్ల కాంగ్రెసేతర పార్టీలను మాత్రమే ఆహ్వానించాలని తన వైఖరిని వెల్లడించింది. ఇంత విస్పష్టంగా చెప్పిన తరువాత కూడా కాంగ్రెస్ను ఆహ్వానించడం, ఇందులో పాల్గొంటున్నట్టు ఆ పార్టీ ప్రకటించడంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ విషయంలో తమకున్న అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఆ పార్టీని ఆహ్వానించడం సరికాదని టీఆర్ఎస్ గట్టిగా అభిప్రాయపడుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్తో ఏ స్థాయిలోనూ వేదిక పంచుకొనే అవకాశం ఉండనే ఉండదని టీఆర్ఎస్ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీ తెలంగాణకు వచ్చి బీజేపీని పల్లెత్తు మాట అనకపోగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి వెళ్లారని.. అందువల్ల అలాంటి పార్టీతో కలిసి కూర్చొని చర్చించే ప్రశ్నే ఉత్పన్నం కాదని టీఆర్ఎస్ ముఖ్యనేతలు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని, గత లోక్సభ ఎన్నికలు మొదలుకొని మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల దాకా, కాంగ్రెస్ తనను తాను పణంగా పెట్టుకొని, డిపాజిట్లు కోల్పోయి మరీ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నదని, అందువల్ల అటువంటి కాంగ్రెస్ను నమ్మే సందర్భమే రాదని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి.
నిర్వహణ పద్ధతే సరికాదు
మరోవైపు విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంకోసం ఏర్పాటుచేసిన ఈ సమావేశం నిర్వహణ పద్ధతే సరిగా లేదని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విపక్ష నేతలు కలిసి కూర్చొని.. ఎవరికీ ఇబ్బంది కలిగించని, అందరికీ ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయ అభ్యర్థిపై ముందుగా చర్చించి ఒక అంగీకారానికి వచ్చి.. ఆ తరువాత ఆ అభ్యర్థి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తారని, కానీ ఇప్పుడు మాత్రం ముందే ఒక అభ్యర్థిని అనుకొని అతనితో సంప్రదింపులు కూడా ప్రారంభించి, ఆ తరువాత సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏమిటని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజాస్వామిక పద్ధతిలో జరిగే చర్చలకు, సంప్రదింపులకు, పట్టువిడుపులకు టీఆర్ఎస్ సానుకూలంగా స్పందిస్తుందని, అదే సమయంలో ఎవరి ఏకపక్ష ఆధిపత్య ధోరణిని కూడా అంగీకరించే ప్రసక్తే ఉండదని టీఆర్ఎస్ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు స్పష్టంచేశాయి. ఆవిర్భావం నాటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ విధానం ఇదేనని, ఒకరు నిర్ణయం తీసుకొని రుద్దుదామంటే సహించేది లేదని స్పష్టంచేశాయి. ఈ కారణాల వల్ల ఈ సమావేశంలో పాల్గొనడం లేదని అవి తేల్చి చెప్పాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే దానిపై టీఆర్ఎస్ తరువాత ఆలోచించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అవి వివరించాయి.
ఏకపక్షంగా సమావేశం
రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటికే షెడ్యూలు విడుదలైంది. బుధవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించడానికి బుధవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటుచేశారు. ఇందుకోసం కాంగ్రెస్తోపాటుగా బీజేపీయేతర పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే విపక్షాల అభ్యర్థిత్వంపై సమావేశానికి ముందే ఒక నిర్ణయానికి వచ్చి.. శరద్పవార్తో సంప్రదించడంపై వివిధ పార్టీల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ సమావేశాన్ని ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఆ పార్టీల అగ్రనేతలెవరూ ఈ సమావేశానికి హాజరు కావడంలేదు. తమ ప్రతినిధులను మాత్రం పంపిస్తున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ సమావేశానికి హాజరు కావడంలేదు. వీరు తమ పార్టీల తరఫున ప్రతినిధులను పంపిస్తున్నారు. మమత, వామపక్ష నేతలు శరద్పవార్ను సంప్రదించగా ఆయన పోటీకి సుముఖంగా లేనట్టు సమాచారం. ఈ విషయంలో ఎన్సీపీ వర్గాలు ఒక స్పష్టత ఇవ్వకుండా నానుస్తున్నాయి. రకరకాలుగా లీకులుస్తున్నాయి. రాష్ట్రపతి రేసులో తాను లేనని, క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మమతా బెనర్జీ, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డీ రాజాలతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో చెప్పినట్టు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి బరిలో ఉండటానికి పవార్ విముఖంగా ఉన్నట్టు భేటీ అనంతరం ఏచూరి కూడా పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పవార్ సుముఖంగా లేకపోవడంతో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును విపక్షాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. 2017 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన గాంధీ ఆ ఎన్నికల్లో వెంకయ్యనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు.