రాష్ట్రంలోని సంక్షేమ పథకాలే సాక్ష్యం
కేసీఆర్ పాలనను ఓర్వలేని బీజేపీ
మాజీ మంత్రి మోత్కుపల్లి వ్యాఖ్యలు
యాదాద్రి, జూలై11: ‘దేశంలో సమూల మార్పు తీసుకురాగల ఏకైక నాయకుడు కేసీఆర్. దేశవ్యాప్తంగా సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు, దళితబంధు, రైతుబంధు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే ఇందుకు ఉదాహరణ’ అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోత్కుపల్లిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే నాయకుడు దేశానికి కావాలని, అది కేసీఆర్తోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చు చేసే పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టంచేశారు.
రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయని అసమర్థుడు ప్రధాని నరేంద్రమోదీ అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన మోదీ దళితుల కోసం ఒక్కమాటా మాట్లాడకపోవడం విడ్డూరమని చెప్పారు. ఎనిమిదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ అంటరానితనం, కుల వివక్ష పోవాలని ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. దళిత వర్గం నుంచి తాను ధైర్యంగా చెబుతున్నా.. కేసీఆర్ లాంటి ధైర్యమున్న నాయకుడు దేశంలో లేడని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను చూసి బీజేపీ ఓర్వలేకపోతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకాన్ని అన్ని రాష్ర్టాలకు ఇవ్వాల్సి వస్తుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నదని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకుల దోపిడీకి పాల్పడ్డవారంతా మోదీ అనుచరులేనని మండిపడ్డారు. దమ్ముంటే దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బండి సంజయ్కి సవాల్ విసిరారు. దళిత పక్షపాతిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ను ఇబ్బందిపెట్టి దళితులకు అన్యాయం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలుచేస్తున్న కేసీఆర్ వెంటే దళితులు, పేదలు, రైతులు ఉన్నారని చెప్పారు.