హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతోపాటు డిపెండెంట్ ఉద్యోగాలను సాధించుకున్నామని సోమవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేకమంది వ్యక్తులు, శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ కార్మికుల మంచికోరే వ్యక్తిగా కారుణ్య నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. వారసత్వ ఉద్యోగాల్లో పురుషులకే కాకుండా కూతుళ్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం మహిళల పట్ల కేసీఆర్కు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తున్నదని కొనియాడారు. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్నవారికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడంతోపాటు ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పొడిగించారని గుర్తుచేశారు.
సింగరేణి క్వార్టర్స్కు ఉచిత విద్యుత్తు, ఏసీ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం, గృహ నిర్మాణానికి 10 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం, మహి ళా కార్మికులకు రెండేండ్ల చైల్డ్కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి ఏరియా దవాఖానల్లో కార్మికుల తల్లిదండ్రులకు కూడా ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం, ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు కొనసాగించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్మెంట్, మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు సాధించుకున్నామని వివరించారు. అమ్మలాంటి సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ కాపాడి, విస్తరించి, ఇతర రాష్ట్రాల్లో సైతం సోలార్, థర్మల్ పవర్ప్లాంట్లను నెలకొల్పి వేలాదిమందికి ఉద్యోగాలు ఇవ్వడం రాష్ట్రం ఏర్పడటం వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే సింగరేణి బిడ్డలు వెలుగు జిలుగులతో అలరారుతున్నారని తెలిపారు.