హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ముఖ్యమంత్రి కేసీఆరేనని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కిపెడుతున్న మోదీ, అమిత్షా ఒంటెత్తుపోకడలను నిలువరించాలంటే కేసీఆర్ దార్శనికత దేశానికి అవసరమని ఆయన చెప్పారు. వర్తమాన భారత రాజకీయ పరిస్థితులపై ప్రవాస భారతీయులతో స్విస్ తెలుగు ఎన్నారై ఫోరం అధ్యక్షురాలు పద్మజారెడ్డి, టీఆర్ఎస్ స్విస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె అధ్వర్యంలో స్విట్జర్ల్యాండ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహేశ్ బిగాల మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
దేశంలో నెలకొన్న ఈ రాజకీయ శూన్యతను సీఎం కేసీఆర్ భర్తీ చేయాల్సి ఉందనే అభిప్రాయం సర్వత్రా నెలకొన్నదని చెప్పారు. కేంద్రంలో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నియంతృత్వ పాలన సాగుతున్నదని, ఇది దేశానికి మంచిది కాదని స్విస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు పద్మజారెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టాన్ని సాధించిన అనతికాలంలోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని, తెలంగాణ నమూనాను దేశానికి విస్తరించాలని హెచ్ఎస్ఎస్ స్విస్ విభాగం నాయకుడు పవన్ దుద్దిళ్ల అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ముగిసిన అధ్యాయమని, బీజేపీ నియంతృత్వ అసంబద్ధ విధానాలను ఎండగట్టే గొంతుక లేకుండా పోయిందని స్విస్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశవనరులు, వాటి సద్వినియోగంపై అపార అవగాహన ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. వీరితోపాటు సమావేశానికి హాజరైన వారంతా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి స్విస్ శాఖ అధ్యక్షుడు కిశోర్ తాటికొండ, స్విస్ తెలుగు సంఘ సభ్యులు అనిల్ జాల, అల్లు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.