ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతున్నదంటే.. మా పార్టీలో జాయిన్ అయితవా? జైలుకు వెళ్తవా? అయితే.. మోడీ, తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ విధానం? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇది ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి.
– కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): వడ్లు కొనాలని కోరితే తెలంగాణ ప్రజలనే నూకలు బుక్కాలన్న బీజేపీకి నూకలు బుక్కిపిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ పదేండ్ల నుంచి అధికారంలో ఉన్నది. ప్రజలకు, చేవెళ్ల యువత, మహిళలకు, అందరికీ దండం పెట్టి చెప్తున్నా. భావోద్వేగాలు పెంచటం, మతపిచ్చి లేపటం తప్ప.. బీజేపీ హాయంలో ఏదైనా ఒక మంచిపని జరిగిందా? పెట్రోల్ ధర ఎంత? డీజిల్ ధర ఎంత? ప్రజలు ఆలోచన చేయాలి. గుడ్డిగా ఓటు వేయొద్దు. చాలా మోసం జరుగుతుంది. ఈ బీజేపీ పదేండ్లలో దేశంలో 157 మెడిల్ కాలేజీలు మంజూరు చేసింది. వాటిల్లో తెలంగాణకు ఒక్కటైనా ఇవ్వాలని వంద ఉత్తరాలు రాసినా. ఒక్కటీ ఇవ్వలేదు. ఒక్క కాలేజీ ఇవ్వని బీజేపికి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? చట్టప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే జిల్లాకొక నవోదయ పాఠశాల పెట్టాలె. మన కొత్త జిల్లాలకు 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలె. అవి వస్తే.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పిల్లలకు, అందరికీ దాంట్లో అవకాశాలు దొరుకుతాయి. నవోదయ పాఠశాలల కోసం వందకు పైగా ఉత్తరాలు రాసినా, 50 సార్లు స్వయంగా మోదీని అడిగినా ఒక్క నవోదయ పాఠశాల కూడా తెలంగాణకు ఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘించి, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటూ ఎందుకు వేయాలి?
బీజేపీ వల్ల ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. ఒక మత్తులో, ఒక మతంలో, ఒక పిచ్చిలో పడి ఓటేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరవు. ఉద్యోగాలు రావు. ఇవాళ దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మొండి బీజేపీ ప్రభుత్వం వాటిని నింపటం లేదు. గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్టు బీజేపీకి ఓటు వేసినా, వేయకున్నా ఒకటే.
– కేసీఆర్
మోదీ నా మెడమీద కత్తిపెట్టి.. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టకపోతే రాష్ర్టానికి వచ్చే నిధులు బంజేస్తా, సంవత్సరానికి రూ.5 వేల కోట్లు గుంజుకుంటా అని బెదిరించిండు. నా ప్రాణం పోయినా సరే.. నేను పెట్టనని చెప్పిన. అన్నట్టే మీటర్లు పెట్టలె. అందుకే ఆనాడు సంవత్సరానికి రూ.5 వేల కోట్లు కోసిండు మోదీ. రూ.30 వేల కోట్ల నష్టం రాష్ర్టానికి వచ్చింది. రైతుల బాధలు తెలుసు కాబట్టి.. కరెంటు వాళ్లకు అవసరం కాబట్టి.. రైతుల మీద భారం పడొద్దని ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నా. ఇయ్యాల బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఏమైతది? మీటర్లు పెట్టుమని చెప్పంగ కూడా మాకే ఓటు వేసిండ్రు.. మాకే గుద్దిండ్రు.. పెట్టుర్రా! ఇగ మీటర్లు అంటరు. మీటర్లు రావాల్నా వద్దా? మీటర్లు రావొద్దంటే బీజేపీని నేలకేసి గుద్దాలె. అప్పుడే మనకు తెలివితేటలున్నట్టు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు.
తెలంగాణలో రైతులు వ్యవసాయం బాగా చేసిండ్రు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వడ్లు బాగా పండినయ్. కాంటాలు పెట్టి ఎక్కడికక్కడే కొన్నాం. బ్యాంకుల్లో డబ్బులేసినం. మధ్య దళారి లేకుండా మద్దతు ధర ఇప్పించినం. ధాన్యం ఎక్కువ పండిందని, కేంద్రమంత్రిని వడ్లు కొనాలని అడిగితే.. యాసంగి వడ్లు నూకలు అవుతయన్నారు. పారా బాయిల్డ్ రైస్కు ఆర్డర్ ఇవాలని అడిగితే ‘మీ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండి. మీరు కూడా నూకలు తినుండ్రి’ అన్నడు. తెలంగాణ ప్రజలు నూకలు తినాల్నట. మనల్ని నూకలు తినుమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిపిద్దామా? ఓట్లు వేద్దామా? అనేది మీరే ఆలోచన చేయాలి. మన ఏడు మండలాలు తీసుకొని ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ. ఏటా 300 మెగావాట్ల కరెంటు వచ్చే మన సీలేరు ప్రాజెక్టును బలవంతంగా గుంజి.. ఆంధ్రాకు అప్పగించింది. మన ఐటీఐఆర్ను క్యాన్సిల్ చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ పెట్టనేలేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుమంటే పెట్టలేదు. ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క నవోదయ స్కూలూ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.