KCR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదని కేసీఆర్ తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతున్నదని అన్నారు. గుడ్ల తీయడం, లాగులో తొండలు ఇడవడం వంటివి ఎలా చేయాలో చెబుతున్నదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా.. ఉన్నవాటిని కూడా ఆపేందని అన్నారు. తీసుకొచ్చిన పాలసీ అంతా కూడా రియల్ ఎస్టేట్కు సంబంధించినదే అని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి, చేను వద్దకు డైరెక్ట్గా వచ్చేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు యూరియా బస్తా కోసం రైతు కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
సమావేశానికి హాజరైన పార్టీ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు pic.twitter.com/0nFbKx8RnZ
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2025