Kisan Samman | జగిత్యాల, ఏప్రిల్ 29, (నమస్తే తెలంగాణ): రైతుబంధు.. ఈ పేరు వింటే వెంటనే కేసీఆర్ గుర్తొస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకుంది. సమయం రాగానే టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. వాటిని పెట్టుబడిగా పెట్టుకుని అన్నదాతలు సంతోషంగా పంటలు సాగుచేసేవారు. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేసిన రైతుబంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2018 డిసెంబర్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి 6 వేల రూపాయలను మూడు విడతల్లో అంటే ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ మాసాల్లో అందిస్తామని ప్రకటించింది. నాడు అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు చిక్కిశల్యమవుతున్నది. అర్థంపర్థంలేని ఆంక్షలు రుద్దుతూ లబ్ధిదారులను ఒక్కొక్కరుగా తొలగిస్తున్నది. నాడు కేసీఆర్ హయాంలో ఒక్కటంటే ఒక్క నిబంధన కూడా లేకుండా స్వేచ్ఛగా పథకాన్ని అనుభవించిన అన్నదాతలు కిసాన్ సమ్మాన్ విషయంలో మాత్రం ఆంక్షల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ రైతుబంధు పేరుతో పంటసాయంగా ఎకరానికి రూ. 5 వేల సాయాన్ని ప్రకటించారు. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమలు చేసిన ఈ పథకంపై ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసలు కురిపించింది. పథకం ప్రారంభించిన తర్వాత ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది తప్పితే తగ్గింది లేదు. అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ మాత్రం ఏడాదికేడాది బక్కచిక్కిపోతున్నది. 2019-20 సంవత్సరంలో 8.23 కోట్లు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2023-24లో 7.56 కోట్లకు పడిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే లబ్ధిదారుల సంఖ్య వేలల్లో పడిపోయింది. డిసెంబర్ 2018లో ఈ పథకం ప్రారంభం కాగా, జిల్లాలో 1,44,545 మంది రైతులకు రూ.28.91 కోట్ల పంటసాయం అందింది. నిరుడు ఆగస్టులో 15వ క్వార్టర్ నాటికి లబ్ధిదారులకు అందిన సాయం రూ. 14.23 కోట్లకు పడిపోయింది.అంటే ఈ మధ్యకాలంలో ఏకంగా 51 శాతం మంది లబ్ధిదారులను అంటే 73,405 మంది రైతులను వివిధ కారణలను సాకుగా చూపి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పరిధి నుంచి తొలగించారు.
కేంద్ర సర్కార్ ఇచ్చే పంట సాయం రోజురోజుకూ చిక్కి శల్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం మాత్రం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. 2018లో అప్పటి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు ప్రారంభించింది. జగిత్యాల జిల్లాలో మొదటి ఏడాది 1,76,928 మంది రైతులకు రెండు దఫాల్లో రూ.310.97 కోట్ల పంట పెట్టుబడిని రైతుబంధు కింద అందజేసింది. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. 2019లో 1,81,916 మందికి, 2020లో 2,00,152 కి, 2021లో 2,10,532, 2022లో 2,17,647, 2023లో 2,39,818 మందికి రైతుబంధు సాయం అందింది. ఆరేండ్ల వ్యవధిలో రూ.2,030.86 కోట్ల పంట సాయం రైతుబంధు ద్వారా జిల్లా రైతులకు అందింది. కేంద్ర ప్రభుత్వం 15 క్వార్టర్ల కాలంలో రూ.376.71 కోట్ల పంటసాయాన్ని మాత్రమే ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దానికి 400 రెట్లు అధికంగా అందజేసింది.
పీఎం కిసాన్ సమ్మాన్లో అర్థంపర్థంలేని నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. ఆధార్కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. ఆదాయపన్ను చెల్లించేవారు కూడా పథకం నుంచి లబ్ధి పొందలేకపోతున్నారు. 2018 తర్వాత వ్యవసాయ భూమి పట్టదారులకు పథకాన్ని అందడం లేదు. రేషన్కార్డులో ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలోని వారికి వేర్వేరుగా భూములు ఉన్నప్పటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించారు. రూ. 10 వేల పెన్షన్ అందుకుంటున్నా ఇవ్వడం లేదు. చట్టసభ్యులకు, ప్రైవేటు రంగ సంస్థల్లో పెద్ద పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను కూడా కిసాన్ సమ్మాన్ నిధికి పరిగణనలోకి తీసుకోవడం లేదు.
సత్యనారాయణ (పేరు మార్చాం)ది జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ. నాలుగు ఎకరాలున్న ఈ రైతుకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. బలహీనవర్గానికి చెందిన సత్యనారాయణ బతికేది వ్యవసాయం పైనే. పిల్లల్ని ఇంజినీరింగ్ చదివించాలనుకున్న సత్యనారాయణకు రైతుబంధు వస్తున్నది. కేంద్ర పథకమైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి కూడా లబ్ధిదారుడుగా ఎంపికయ్యాడు. మూడు విడతలుగా ఏటా రూ. 6 వేలు వచ్చేవి. పిల్లల ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యే దశకు చేరడంతో వారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాలని సత్యనారాయణ నిర్ణయించుకున్నాడు. ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకును సంప్రదిస్తే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో వారు చెప్పినట్టే చేశాడు. అది మొదలు ఆయనకు కిసాన్ సమ్మాన్ నిధి పంట సాయం ఆగిపోయింది. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంతో ఆదాయ పరిమితిని లెక్కలోకి తీసుకుని పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తన పేరును తొలగించినట్టు తెలిసి విస్తుపోయాడు.
జగిత్యాల మండలం ధరూర్లో ఎకరం భూమి సాగు చేస్తున్నా. రైతుబంధు సాయం ప్రతి ఏడాది వస్తున్నది. కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఏడువిడతలు అందించారు. ఎనిమిదో విడత నుంచి డబ్బులు వస్తలేవు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతున్నది. నా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చేయించిన. అయినా డబ్బులు పడతలేవు. ఎందుకు వస్తలేవో అర్థం కావడం లేదు. నాతోటి రైతులకు వచ్చి నాకు ఆగిపోయినయ్.
– కొలువూరి రవీందర్రావు, రైతు, ధరూర్, జగిత్యాల
గుట్రాజ్పల్లిలో ఎకరం 35 గుంటల భూమిని సాగు చేస్తున్నా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం అందరితోపాటు నేనూ దరఖాస్తు పెట్టుకున్నా. గ్రామంలో కొందరు రైతులకు పథకం ద్వారా సంవత్సరానికి రూ. 6000 వస్తున్నయి. నాకు మాత్రం రావడం లేదు. వీలున్నప్పుడల్లా జగిత్యాలకు వెళ్లి ఆఫీసులో కలిసి వస్తున్నా. దరఖాస్తును మూడుసార్లు ఇచ్చినా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుసాయం ప్రతి ఏటా వస్తున్నది. కిసాన్ సమ్మాన్ పథకం మాత్రం రావడం లేదు.
– జంగిలి గంగయ్య, రైతు, గుట్రాజ్పల్లి, జగిత్యాల మండలం
నేను గుట్రాజ్పల్లిలో మూడెకరాల భూమిని సాగు చేస్తున్నా. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు సాయం వస్తున్నది. కేంద్ర నుంచి కిసాన్ సమ్మాన్యోజన పథకం పైసలు వస్తలేవు. రెండుమూడుసార్లు ఏఈవోలకు దరఖాస్తు ఇచ్చి ఆన్లైన్ చేయించుకున్నా డబ్బులు రాలే. ఆ పథకం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు డబ్బులు రాలే. దీనిపై జగిత్యాల అగ్రికల్చర్ ఆఫీసుకు వెళ్ళి అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించుకున్నా. డబ్బులు వస్తాయని చెపుతున్నారే తప్ప అవి మాత్రం రావడం లేదు. ఇక తిరగడం నా వల్ల కాక విరమించుకున్నా.
– పయ్యావుల తిరుపతిరెడ్డి, గుట్రాజ్పల్లి, జగిత్యాల