హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దపు అతిపెద్ద మానవ విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని వెల్లడించారు. పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని, నాడు శపథం చేసి.. నేడు సాకారం చేశారని స్పష్టం చేశారు. 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2015 జూన్ 11న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సందర్భంగా భూత్పూర్ బహిరంగసభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తా. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా. కృష్ణమ్మ నీళ్లను కలశాలలో ప్రతి పల్లెకు తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్థనాలయాల్లో అభిషేకం చేస్తాం’ అని నాడు సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని నెమరువేసుకున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేసులు, నీళ్లు విడుదల చేయకుండా అవరోధాలు సృష్టించినా.. విరోధుల వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లిన కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా సుమారు రూ.25 వేల కోట్ల నిధులను దశలవారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టును పూర్తిచేసుకుంటున్నామని పేర్కొన్నారు. దశాబ్దాల కిందటే కృష్ణా నీళ్లు పాలమూరుకు దకి ఉంటే దేశంలోనే ఒక హరిత ప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో అగ్రభాగాన ఉండే ప్రాంతంగా విలసిల్లేదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ పథకాన్ని పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. 16న కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి పంపుల వెట్న్త్రో పాలమూరు ప్రజల కల నెరవేరబోతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కలశాలతో కృష్ణా నీళ్లు తీసుకెళ్లి గ్రామాల్లోని దేవాలయాల్లో దేవుళ్లను అభిషేకించాలని సూచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1,600 పైచిలుకు గ్రామాల్లో పెద్దఎత్తున సంబురాలు జరిపాలని కోరారు. పాలమూరు ప్రజల ఆకలి, దాహార్తి తీర్చేది కృష్ణమ్మేనని ఆనాడు నా ఇంటికి కూడా కృష్ణమ్మ అని పేరు పెట్టుకున్నానని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆశించినట్టే ఈ రోజు పాలమూరులోని ప్రతి పల్లెకు కృష్ణమ్మ రాబోతున్నదని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావటం చిరస్మరణీయమైనదని తెలిపారు.