KCR | వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన భారతదేశ సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. భారత సమాజంలో వర్ణ, కుల లింగ వివక్షతను రూపుమాపి, సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దార్శనికుడు మహాత్మా ఫూలే అని కొనియాడారు.
సబ్బండ వర్ణాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన జ్యోతిరావు ఫూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని కేసీఆర్ తెలిపారు. తన భార్య సావిత్రి బాయి ఫూలేకు చదువు నేర్పించి మరీ, చదువు నిరాకరించబడిన భారత మహిళకు విద్య నేర్పాలనే ధృఢ సంకల్పాన్ని అనేక కష్ట నష్టాల నడుమ అమలు చేసిన, మహిళాభ్యుదయ మార్గదర్శి మహాత్మా ఫూలే అని కొనియాడారు.
ఫూలే ఆశయాలను నిజం చేస్తూ, తన పదేండ్ల ప్రగతి పాలనలో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అమలు చేసి ఫలితాలను సాధించిన పలు రకాల పథకాలను కార్యాచరణను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సాగునీరు, విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచామని తెలిపారు. పలు వృత్తికులాలను ప్రోత్సహిస్తూ గొర్రెల పెంపకం, చేపల పంపిణీ, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేయడం ద్వారా నూటికి తొంభైశాతంగా ఉన్న దళిత బహుజన కులాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని తెలిపారు. తద్వారా, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం జరిగిందని అన్నారు.
ఆసరా ఫించన్లు, బీసీ బంధు వంటి బహుజన సంక్షేమ పథకాల అమలు ద్వారా, వెనకబడి ఉన్న సబ్బండ కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేసామన్నారు. బీసీ కులాల విద్యకోసం ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యనందించినామని కేసీఆర్ తెలిపారు. బీసీ బిడ్డల భవిష్యత్తు తరాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు రాష్ట్ర రాజధాని నగరం హైద్రాబాద్ లో ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం, అత్యంత విలువైన స్థలాలను, నిర్మాణ నిధులను,బీసీ కుల సంఘాలకు కేటాయించినామని తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఫూలే ఆశయాలకు అనుగుణంగా తాము గత ప్రభుత్వంలో అమలులోకి తెచ్చిన ప్రగతి కార్యాచరణను చిత్తశుద్దితో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తద్వారా మాత్రమే మహాత్మాఫూలేకు మనం ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్ఠం చేశారు.