కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకుగాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడుకోలేదు. పైగా దయతో మేమే తెలంగాణ ఇచ్చామని అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఇది గర్హనీయం. ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి.
– సీఎం రేవంత్కు లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రికి బిఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి బహిరంగలేఖ , తేది: 01/06/2024.
గౌరవ ముఖ్యమంత్రి, శ్రీ ఎనుముల రేవంత్రెడ్డి, తెలంగాణ రాష్ట్రం – గారికి.. హైదరాబాద్
ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజాపోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్య్రాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుంచీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం.
1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఆదిగా, కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. ఫజల్అలీ కమిషన్ సిఫార్సులను కాలరాచి, తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసి, తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్పార్క్ అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలబడిపోయింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాదిమంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే.
ఉద్యమంలో మేలి మలుపు టీఆర్ఎస్ ఆవిర్భావం
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పడడం తెలంగాణ ఉద్యమంలో మేలిమలుపు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణనిచ్చింది.
తెలంగాణవాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది. తెలంగాణ డిమాండ్కు విస్తృత ఆమోదాన్ని సాధించింది. ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను చేర్చింది. ఊరూరా వాడవాడలా సభలూ సమావేశాలూ నిర్వహించి భావజాల వ్యాప్తి చేసింది. ఎన్నికల ద్వారా ప్రజల తీర్పును రాబట్టి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖితపూర్వకంగా సాధించి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోగా, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు పాల్పడింది. కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులను, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను తృణప్రాయంగా వదులుకొని ఉద్యమ బాటపట్టిన టీఆర్ఎస్ అనేక పోరాట రూపాల ద్వారా తెలంగాణ ఆకాంక్షని లోకానికి చాటింది. చివరికి నేను నా ప్రాణాలను ఫణంగా పెట్టి ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వచ్చింది.
యావత్ తెలంగాణ నా నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచి భూమ్యాకాశాలను ఒక్కటి చేసే విధంగా ఉద్యమిస్తే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. సమైక్య పాలకుల ఒత్తిడికి తలొగ్గి, చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ మరోసారి ఘోరమైన మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకు గాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు.
తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడుకోలేదు. పైగా దయతో మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య, అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ వైఖరి పూర్తిగా గర్హనీయం. ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి.
రాజకీయ అవసరాల కోసం కాకుండా, మనస్ఫూర్తిగా కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే, కొంతలో కొంత అయినా అది పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటి నుంచి ఇప్పటి వరకూ జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదు. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీనుంచి కోరుకుంటున్నది.
కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదు.. ఇక మారదు
మీరు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకూ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయ పరిచారు. మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒక్కటే. కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదు. ఇక మారదు. ఇక ముందు మారే అవకాశం లేదు. నాటికీ, నేటికీ ఎన్నటికీ కాంగ్రెస్కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప, మనఃపూర్వక ఆమోదం కాదు. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగుతున్న దాదాపు ఈ ఆరునెలల కాలంలో ప్రజా జీవితం అస్తవ్యస్తమై పోయింది. ముఖ్యంగా రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది. సస్యశ్యామలమై, సుసంపన్నమైన తెలంగాణ బతుకు చిత్రాన్ని మీ అసమర్థ పాలన చిదిమివేసి, ఛిద్రం చేసింది.
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతతో శాశ్వతంగా దూరమైన కష్టాలు, సమస్యలన్నీ మీ అసమర్థ పాలనతో ఆర్నెలల్లోనే తిరిగి ప్రత్యక్షమైతున్నయి. ఈ వింతను, విషాదాన్ని సబ్బండ వర్గాల ప్రజలు విస్తుబోయి చూస్తున్నారు. ఇంతలోనే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఎందుకు మారుతున్నదో అర్థంకాక తెలంగాణ సమాజం అయోమయానికీ ఆవేదనకు గురవుతున్నది.
కరెంటు ఎండిన లక్షల ఎకరాల పంటలు
బీఆర్ఎస్ పరిపాలనా కాలంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకూ 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరిగింది. అత్యుత్తమ విద్యుత్తు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ర్టానికి ఎన్టీపీసీ ద్వారా సుమారు1400 మెగావాట్ల అదనపు విద్యుత్తు సమకూరింది. అయినప్పటికీ మీ అసమర్థతో అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ మీరు రైతాంగం ఉసురుపోసుకుంటున్నారు. తొమ్మిదేండ్లు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారం లోకి రాగానే ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతున్నదో అర్థంకాక నేను నా విస్మయాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.
ఈ పరిణామం రాష్ట్ర ప్రతిష్ఠకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారిందనేది నిర్వివాదాంశం. మీరు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోవటంతో లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయినయి. చాలీచాలని కరెంటుతో లక్షల ఎకరాలు ఎండిపోయినయి, రైతన్నల గుండెలు బద్దలై పోయినయి. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, కరెంటు కోతలకు ఆకాల వర్షాలు తోడై పంటలు దెబ్బతినిపోయాయి. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. వారికి భరోసానిచ్చే చర్యలేవీ చేపట్టలేదు.
చెప్పుతో కొడతామని రైతన్నను అవమానించారు
ప్రపంచమే మెచ్చిన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నది. అన్నదాతలు పంట పెట్టుబడి కోసం ఎవరి వద్దా చేయి చాచవలసిన పరిస్థితి ఉండకూడదనే ఉదాత్తమైన లక్ష్యంతో మా హయాంలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినం. సమర్థవంతంగా అమలుచేసినం. ఆరేండ్లలో 70 లక్షలమంది రైతులకు 73 వేల కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కింద అందించినం.
కరోనా ఉత్పాతం విరుచుకుపడి, రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బతిన్న దశలో సైతం మేము రైతులకు లోటు రానివ్వలేదు. అంత క్లిష్ట సమయంలో కూడా సకాలంలో రైతుబంధు సహాయం అందించినం. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధు సహాయం సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. సరైన సమయంలో పంట పెట్టుబడి అందకపోవడంతోపాటు, డిసెంబర్ 9 లోపు మీరు చేస్తామని చెప్పిన రుణమాఫీ చెయ్యక పోవడంతో రైతులకు అన్ని మార్గాలు మూసుకు పోయాయి. చివరికి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుర్గతిలోకి రైతులు నెట్టబడ్డారు.
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతామని మీ మంత్రివర్గ సహచరుడు దురహంకారంతో చేసిన వ్యాఖ్య విని యావత్ తెలంగాణ కోపంతో ఉడికిపోయింది. మీరు సదరు మంత్రిని మందలించిన పాపాన కూడా పోలేదు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మీరు రైతులను మన్నింపు కోరలేదంటే రైతుల పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చులకనభావం స్పష్టమైతున్నది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలన రైతులను తలమీద పెట్టుకొని గౌరవిస్తే, ఆరు నెలల మీ పాలన రైతులను చెప్పుతో కొడతామని దారుణంగా అవమానించింది. మీరు రైతు భరోసా పథకం ద్వారా ఏటా 15,000 రూపాయల పంట పెట్టుబడి సహాయం అందిస్తామని, ఇది వందరోజుల్లోనే అమలులోకి తెస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ప్రకటించారు. గద్దెనెక్కినంక మాట తప్పి రైతుల ఆశలను అడియాసలు చేశారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారు
ఇక నీటి పారుదల విషయానికి వస్తే గత పదేండ్లలో స్వర్ణ యుగాన్ని అనుభవించిన రాష్ర్టాన్ని కృత్రిమ కరువు పాలు చేశారు. నదీ జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్నా, ఆ పని చేయకుండా నీళ్లు సముద్రం పాలవుతుంటే మీ క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తూ కూర్చున్నారు. కేంద్రం ఎన్ని రకాలుగా మామీద ఒత్తిడి తెచ్చినా మేము ప్రాజెక్టుల మీద అధికారాన్ని బోర్డులకు అప్పగించడానికి అంగీకరించలేదు.
మీరు సోయిదప్పిన తీరుగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజేప్పేశారు. రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారు. నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గోదావరి జలాలను సైతం తరలించుకు పోయే ప్రణాళికలు తయారుచేస్తుంటే మీరు గుడ్లప్పగించి చూస్తున్నారు. మీ చేతగానితనంతో రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా సకాలంలో మీరు పొలాలకు వదలలేదు. దానివల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయేట్టు చేశారు.
బోనస్పై దగా.. మోసం
బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి, చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడినం. కొద్దోగొప్పో పండిన పంటను అమ్ముకుందామని మార్కెట్యార్డులకు వచ్చిన రైతులకు అక్కడ కూడా అవస్థలే ఎదురవుతున్నాయి. కొనే నాథుడు లేక రోజులకొద్దీ రైతులు పడిగాపులు కాస్తున్నారనే వార్తలు కోకొల్లలు. రాష్ట్రంలో రైతులు ఎండలో పడిగాపులుపడి పంటకుప్పలపైనే ప్రాణం విడిచిన సంఘటనలు నా హృదయాన్ని మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల హృదయాలనూ తీవ్రంగా కలిచి వేశాయి.
అన్ని పంటలకూ మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్ ఇస్తామన్న మీ హామీని మీరు నిలబెట్టుకోక పోవడం చూసిన రైతులు.. ఇంత దగానా? ఇంత మోసమా? అని ఆశ్చర్యపోతున్నారు, తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చావు కబురు చల్లగ చెప్పినట్టు సన్నవడ్లకే బోనస్ఇస్తామని మాట మారుస్తున్రు. మోసపూరితమైన మీ వైఖరిని రైతాంగం నిశితంగా గమనిస్తున్నదని మీరు తెలుసుకోవాలి. మ్యానిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి అన్ని రకాల పంటలకూ విధిగా 500 రూపాయల బోనస్ చెల్లించాలి.
రైతులు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నరు
గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ రావడానికి ముందే స్టాకు పెట్టుకొని విత్తనాలు ఎరువులు సకాలంలో సరఫరా చేసింది. మీ పరిపాలనలో పచ్చిరొట్ట కింద వేసుకునే విత్తనాలకోసం కూడా రైతులు లైన్లు కట్టాల్సిన అగత్యం సృష్టించారు. బ్లాకులో పత్తి విత్తనాల అమ్మకం జరుగుతున్నది అంటే అవినీతి ఎంతగా పెచ్చుమీరిందో అర్థం అవుతున్నది. గత పదేండ్లలో తెరపినపడ్డ వ్యవసాయరంగం తిరిగి సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నది.
మాయమైపోయిన బోరుబండ్లు మళ్లా ఊరి దారి పట్టినై. రైతులు తమ కష్టార్జితాన్ని బోరుపొక్కల్లో ధారపోస్తున్నారు. ఎండిపోయిన పంటచేనును పశువుల మేతకు వదిలి రైతులు దీనంగా రోదిస్తున్న దృశ్యాలు చూసిన వారిని కన్నీరు పెట్టించాయి. బాయికాడ కరెంటు పెట్టబోయి షాకు తగిలి ప్రాణాలు పోగొట్టుకోవడం, పాముకాటుతో మరణించడం నిరాశ, నిస్పృహలతో అనేకమంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టడం చూసి గుండె తరుక్కుపోతున్నది.
కాంగ్రెస్ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతం కావడం ఖాయమని ఈ సంఘటనలు సూచిస్తున్నాయి. ఒక్క రైతులే కాదు , మీ పాలన తీరుతెన్నులతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము పదేండ్లుగా చేనేత కార్మికులకు, మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని కల్పించాం. ఇటు వారి ఆత్మహత్యలను నివారించాం. అటు స్కూలు పిల్లలకు, పేద మహిళలకు నాణ్యమైన చేనేత వస్ర్తాలు అందించాం . మరి మీరు? అధికారంలోకి రాగానే ఆ పద్ధతికి స్వస్తి పలికారు. కార్మికులు చేసిన పనికి రావాల్సిన పాత బకాయీలు కూడా మీ ప్రభుత్వం చెల్లించడం లేదు. ఉపాధి కోల్పోయామనే రందితో సిరిసిల్ల ప్రాంత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం చూసి తెలంగాణ సమాజం తల్లడిల్లిపోతున్నది.
ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు
ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000 ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటివరకూ వారికి ఒక్కపైసా ఇవ్వకపోగా, మీ ముందుచూపు లేని నిర్ణయాల వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. మీ అనాలోచిత విధానాలతో వారి కడుపు మీద దెబ్బకొట్టారు. అలో లక్ష్మణా అని వారు అలమటిస్తుంటే మీరు ఆదరించి అక్కున చేర్చుకోవడం లేదు. వారికొక దారి చూపడం లేదు. దీంతో పలువురు ఆటోకార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం మీ పాలన సృష్టించిన పెను విషాదం. రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు . వారికి ఇప్పటివరకూ ఒక్క పైసా ఇవ్వలేదు. వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నది. పొట్ట చేతపట్టుకొని వలసబాట పడుతున్న దృశ్యాలు తెలంగాణలో తిరిగి కనిపిస్తున్నాయి.
జై తెలంగాణ! జై భారత్!! కొద్దోగొప్పో పండిన పంటను అమ్ముకుందామని మార్కెట్యార్డులకు వచ్చిన రైతులకు అక్కడ కూడా అవస్థలే ఎదురవుతున్నాయి. కొనే నాథుడు లేక రోజులకొద్దీ రైతులు పడిగాపులు కాస్తున్నారనే వార్తలు కోకొల్లలు. రాష్ట్రంలో రైతులు ఎండలో పడిగాపులుపడి పంటకుప్పలపైనే ప్రాణం విడిచిన సంఘటనలు నా హృదయాన్ని మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల హృదయాలనూ తీవ్రంగా కలిచి వేశాయి. అన్ని పంటలకూ మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్ ఇస్తామన్న మీ హామీని మీరు నిలబెట్టుకోక పోవడం చూసిన రైతులు.. ఇంత దగానా? ఇంత మోసమా?
రూ. 2,500 కోసం మహాలక్ష్ముల ఎదురుచూపు
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇస్తామని ఊదరగొట్టారు. రాష్ట్రంలోని మహిళలు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తామని చెప్పిన హామీకి ఆరు నెలలు అవుతున్నా అతీగతీ లేదు. మహాలక్ష్మి పథకం మహామాయగా మిగిలిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. విద్యార్థులకు 5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నారు.
విద్యా సంవత్సరం మొదలవుతున్నా ఈ హామీలు అమలు దిశగా ఒక్క అడుగు కూడా పడిన దాఖలా లేదు. అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాలలో చదువుకోసం ఇచ్చే రూ. 20 లక్షల ఓవర్సీస్స్కాలర్షిప్ ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఈ పరిణామాలతో విద్యార్థి లోకంలో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది.
అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్ర్తాలు ఊడగొట్టారు
వృద్ధులు తదితర అసహాయులైన ప్రజానీకానికి చెల్లించే ఆసరా పింఛన్లను రూ. 2016 నుంచి రూ. 4,000కు పెంచి ‘చేయూత’ పేరుతో అందిస్తామని మ్యానిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికీ పెంచకపోగా జనవరి నెలకు సంబంధించిన పింఛను నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు.
‘అన్నవస్ర్తాలకు పోతే ఉన్నవస్ర్తాలు ఊడిపోయిన’ చందంగా వారి పరిస్థితి మారింది. వృద్ధులు తదితరులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేల చొప్పున అధికారంలోకి వచ్చిన తక్షణమే చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పిన్రు. పెంచిన చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి చెల్లిస్తారో ఇప్పటికీ మీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగాదగా’ అనే కవితా వాక్యాలు మీ పాలనకు సరిగ్గా సరిపోతాయి.
నిరుద్యోగుల నిలువు దోపిడీ
మీరు నిరుద్యోగులకు చూపిన ఆశలు అన్నీ ఇన్నీ కావు. మొదటి క్యాబినెట్లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అన్నారు. మెగా డీఎస్సీని, దగా డీఎస్సీ చేశారు. మేము ఇచ్చిన ఐదువేల పోస్టులకు సుమారుగా మరో ఐదువేలు కలిపి ఇదే మెగా డీఎస్సీ పొమ్మన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఆ దిశగా కనీస చర్యలు లేవు. రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు అనలేదని మాట మారుస్తున్నారు. జాబ్ క్యాలెండర్ జాడేలేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఏదీ మొదలుపెట్టలేదు. పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థులకు పరీక్ష ఫీజు వసూలు చేయబోమని ఎన్నికల ప్రణాళికలో చెప్పి, అధికారంలోకి రాగానే రూ.400 ఉన్న ఫీజును రూ.2000కు పెంచి నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్భగీరథ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేసింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా ఉన్న వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేని కాంగ్రెస్ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. గ్రామాల్లో పట్టణాల్లో జనం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. నగర ప్రజలు తాగునీటి ట్యాంకర్ల కోసం లక్షలు ఖర్చు చేయవలసిన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు.

తొమ్మిదేండ్లు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారం లోకి రాగానే ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతున్నదో అర్థంకాక నేను నా విస్మయాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పరిణామం రాష్ట్ర ప్రతిష్ఠకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారిందనేది నిర్వివాదాంశం. మీరు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోవటంతో లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయినయి.
ప్రజావైద్యం పడకేసింది
మా పాలనలో ప్రజావైద్యాన్ని ఎంతగానో మెరుగుపరిచాం, దవాఖానలను బలోపేతం చేశాం. నూతన దవాఖానలు నిర్మించాం. అన్ని బెడ్లకూ ఆక్సిజన్ సదుపాయం కల్పించాం. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం. జిల్లాకో మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం. మీరు అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజావైద్యం దిగజారుతున్నది. డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వీర్యమయ్యాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
కరెంటు కోతల వల్ల అత్యవసర వైద్య సేవలకు విఘాతం కలుగుతున్నది. ఈ విషయంపై వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. కొన్ని కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిన పాపాన పోవడం లేదు. మేము నగరం నాలుగు వైపులా చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణం, వరంగల్లో మొదలుపెట్టిన భారీ దవాఖాన నిర్మాణం వేగంగా సాగక కుంటుపడ్డది. వరంగల్ దవాఖాన స్థాయిని కుదిస్తున్నారనే వార్తలు ప్రజలను నిరాశకు గురిచేస్తున్నాయి.
హరితహారం మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేదు 
బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి, పచ్చదనం పెరిగింది, మౌలిక వసతులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పాలన షురూ కాగానే ప్రభుత్వంలో పట్టింపు లేదు. పర్యవేక్షణ లేదు. గ్రామాలు మళ్లీ మురికి కూపాలవుతున్నాయి. పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ అదుపు తప్పింది. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం, ట్రాక్టర్ల డీజిల్ బకాయిలు చెల్లించకపోవడంతో చెట్లు వాడిపోతున్నాయి. కాంగ్రెస్ పాలనలో పరిశుభ్రతకూ, పచ్చదనానికి గ్రహణం పట్టిందని జనం వాపోతున్నారు.
నిలిచిపోయిన ఆర్టీసీ విలీన ప్రక్రియ 
అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మూడు డీఏలు చెల్లిస్తామన్నారు. ఆ వాగ్దాన మూ నెరవేర్చలేదు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇంకా మీరు అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాల చిట్టా చాలా పెద్దది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇచ్చే లక్షా నూటపదహారు రూపాయలపై అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. ఈ ఆరునెలల్లో లక్షల సంఖ్యలో పేదల వివాహాలు జరిగాయి. ఏ ఒక్కరికీ తులం బంగారం ఇవ్వలేదు. అసలు ఇస్తారో ఇవ్వరో కూడా అర్థం కావడం లేదు. తులం బంగారం మాటేమోగానీ ఇవాల్సిన లక్ష రూపాయల చెక్కులు సైతం కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు.
రాష్ట్రంలో పారిశ్రామికరంగం కుదేలవుతున్నది. కరెంటు కోతలు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ రంగంలోనూ అదే పరిస్థితి.
ప్రశ్నిస్తే భౌతిక దాడులా?
ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన మీరు, మిమ్మల్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్యచేసే దుష్ట సంస్కృతిని మీ పార్టీ తీసుకొస్తున్నది. సోషల్మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై మీ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను ఆహ్వానించక పోవడం మీ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం. తెలంగాణ పోరాటంలో అన్నీ తానై నిలిచిన బీఆర్ఎస్ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
తెలంగాణ అస్థిత్వ చిహ్నాలపై విషం
తెలంగాణకు గర్వకారణమైన అస్థిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తామని అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. వెయ్యి సంవత్సరాల కిందనే గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానిస్తున్న మీ పాపానికి నిష్కృతి లేదు. ప్లేగువ్యాధి మృతుల స్మృత్యర్థం కుతుబ్షాహీల కాలంలో నిర్మించిన హైదరాబాద్ ఐకాన్, చార్మినార్కు మలినాన్ని ఆపాదిస్తూ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రేమికుల, మనోభావాల్ని దారుణంగా గాయపరుస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం, అవమానకరం.
అవమానకరంగా ఆహ్వానం
సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు. ఇక మీరు నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, 15 సంవత్సరాల పాటు ప్రజా పోరాటాన్ని నడిపించి, తెలంగాణ డిమాండ్కు మద్దతుగా రాష్ట్రంలోని, దేశంలోని పార్టీల మద్దతు కూడగట్టి, స్వరాష్ట్ర సాధన కోసం కేంద్రమంత్రి పదవినీ, ఎంపీ పదవినీ తృణప్రాయంగా వదిలివేసి, చివరికి ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నావంటి వాడిని మీరు ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది.
తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు, వేదికపై స్థానం గానీ, రాష్ట్ర సాధనలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కానీ కల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట . నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమాన పరచదలుచుకున్న మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు. రానున్న కష్టాలను తలచుకుని తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది. ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది.
అందుకే రావడం లేదు
ఒకవైపు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆక్రోశం, పని కోల్పోయినందుకు ప్రాణాలు తీసుకుంటున్న చేనేత కార్మికుల దుఃఖం, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల ఆవేదన, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ తల్లడిల్లుతున్న నిరుద్యోగుల్లో ఆవరించిన నిస్తేజం, తాగే నీళ్ల కోసం తండ్లాడుతున్న తల్లుల ఆయాసం, కరెంటు కోతలతో మసక బారుతున్న రాష్ట్ర ప్రతిష్ఠ, కుంటుపడుతున్న పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతి, ఒకటని కాదు, అన్ని రంగాలు అరు నెలల్లోనే ఆగమైపోయిన విషాదం. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణవాదుల అభిప్రాయంగా ఉంది. అందువల్ల పైన పేర్కొన్న కారణాల రీత్యా, ప్రజాజీవితాన్ని క్రమక్రమంగా కల్లోలంలోకి నెడుతున్న మీ పాలననూ, మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లను అడుగడుగునా అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరినీ, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలనూ నిరసిస్తూ మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనబోవడం లేదని తెలియ జేయడానికి విచారిస్తున్నాను.
ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారనీ, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను.
ఇట్లు
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
బి ఆర్ఎస్పార్టీ అధ్యక్షులు