KCR Nutrition KIT | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తం చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖకు కేటాయించిన రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. 2023-24 లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6.84 లక్షల మహిళలు లబ్ధి పొందనున్నారు. 24 జిల్లాలో 111 కేంద్రాల్లో కిట్ల పంపిణీ ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల సంఖ్యకు సరిపడా కిట్లు ఉండేలా చూడాలన్నారు. కిట్ల నిల్వ సురక్షితంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కిట్లు పొందేందుకు వచ్చే గర్భిణులు ఇబ్బంది పడకుండా ఉండేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.
ఇప్పటికే ప్రారంబించిన కేసీఆర్ కిట్ ఒక అద్భుత పథకం అని, దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందన్నారు. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామని, ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారనీ మంత్రి అన్నారు.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. నాలుగు ఏఎన్సీ చెకప్స్, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు దోహదం చేస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.
రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం1.25 లక్షల మంది గర్భిణులకు రెండు ఏఎన్సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా (మిగతా 24 జిల్లాల్లోనూ) కిట్స్ పంపిణీ నీ వైద్యారోగ్య శాఖ ప్రారంభించనుందన్నారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.
కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
కిలో ఖర్జూర
ఐరన్ సిరప్ 3 బాటిల్స్
500 గ్రాముల నెయ్యి
కప్పు
పల్లి పట్టి 200 గ్రాములు
ప్లాస్టిక్ బాస్కెట్