KCR | తెలివిలేక.. ప్రభుత్వాన్ని నడిపే చేతగాక మందిమీద బద్నాంపెట్టి బతుకుదామనుకుంటున్నారా? అట్లగాదు బిడ్డా జాగ్రత్తా..! బతుకనివ్వం.. వెంటపడుతం.. వేటాడుతాం అంటూ అధికార కాంగ్రెస్కు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరావు హెచ్చరించారు. ఛలో నల్లగొండ సభలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రం వచ్చాక కరెంటు తెచ్చాం. ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగు చేసి ఏడాదిన్నర నుంచి 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చాం. మీరంతా సంతోషంగా నడింట్లో పండుకొని పంటలు పండించారు. పాములు, తేళ్లు కరువంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కట్కేసినట్టే బంద్ అవుతుందా కరెంటు? నేను తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటు దానికి ఏం రోగం అయ్యింది.. మాయ రోగం వచ్చిందా? యాడపోయే కరెంటు’ అంటూ మండిపడ్డారు.
‘దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్లు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావొద్దు. ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. ఏమైందిరా బిడ్డ నా కరెంటు అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లకుల్లగా చెబుతున్న. మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా.. ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4వేల మెగాపవర్ ప్లాంట్ కట్టినం జగదీశ్రెడ్డి నాయకత్వంలో. 90శాతం పనులు పూర్తయ్యాయి. రెండుమూడు నెలలు తిప్పలుపడితే 4వేల మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆ నాడు మొదలుపెట్టిన ఎన్టీపీసీ 800 మెగావాట్ల పవర్ వచ్చింది. ఇంకో 800 మెగావాట్లు రాబోతున్నది. ఆ నాడు నడిపిన నాడు ఉన్నదాని కంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువగ ఉండంగ కూడా.. వీళ్లకు ఏం రోగం పుట్టింది.. కరెంటు ఎందుకు ఇస్తలేరు ? ఎందుకు తిప్పలుపెడుతున్నరు ? బిడ్డా ఛలో నల్లగొండతోనే ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజార్లలో నిలదీస్తాం’ అని స్పష్టం చేశారు.
‘ప్రజలను కరెంటుకు తిప్పలు పెట్టినా.. నీళ్లకు తిప్పలుపెట్టినా.. మంచినీళ్లకు తిప్పలుపెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడుతాం. మీకు గవర్నమెంట్ ఇచ్చారు. మాకు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చారు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత ఇచ్చారు తప్పా.. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తం తప్పా.. వదిలిపెడతాం అనేదాంట్లో ఉండొద్దు. ప్రజలకు అన్యాయం చేయొద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో.. ఆ విధంగా కరెంటును పునరుద్ధరించాలి. ఆవిధంగా రాష్ట్ర రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ల యవ్వారం ఎట్లున్నది ? చరిత్రలో ఎన్నడూ లేదు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టారు వీళ్ల తెలివికి. మొన్న మనోళ్లు మీటింగ్లో తిరుగుతుంటే.. ఒక్క మీటింగ్లో మాట్లాడుతుంటే ఏడుమాట్లు పోతది కరెంటు. నల్లగొండలో జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంటు పోతది. ఏం మాయరోగమచ్చింది. మీకు తెలివి లేక.. నడపరాక.. చేతగాక ఇవాళ మందిమీద బద్నాం పెట్టి బతుకుదామనుకుంటున్నరా? అట్లగాదు బిడ్డా జాగ్రత్త బతుకనివ్వం. వెంటపడుతం. వేటాడుతం’ అని హెచ్చరించారు.