బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార భేరి మోగించింది. చేవెళ్ల నుంచే కదన శంఖారావాన్ని పూరించింది. లోక్సభ ఎన్నికల తొలి ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
బీఆర్ఎస్ పనైపోయిందంటూ కొన్నిరోజులుగా పనిగట్టుకుని జరుగుతున్న దుష్ప్రచారాన్ని జనబాహుళ్యం ముందు బద్దలుకొట్టింది బీఆర్ఎస్. వ్యూహకర్తలల్లిన సాలెగూడులో సోషల్మీడియా ఆడుతున్న మైండ్గేమ్ను మైదానంలో తుత్తునియలు చేశారు కేసీఆర్.
చేవెళ్ల గడ్డ నుంచి కాంగ్రెస్, బీజేపీలకు గట్టి హెచ్చరికలు పంపారు గులాబీ దళపతి. మాయచేయడమే మార్పు అనుకునే వారి ఆటలిక సాగవని అల్టిమేటం ఇచ్చారు. ‘మౌనంగా ఉండే సమస్యే లేదు. యుద్ధం చేసుడే..’ అని రణన్నినాదం చేశారు. బీసీలకు దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ కూసి‘నోళ్లు’ మూతపడేలా కాసానిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
నాలుగున్నర నెలల్లోనే తామేం కోల్పోయామో ప్రజలు గ్రహిస్తున్నారనటానికి బీఆర్ఎస్ చేవెళ్ల సభ విజయవంతమే సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిడికెడు నాయకులు వెళ్లిపోయినా.. పిడికిలెత్తిన కార్యకర్తలు లక్షలాదిమంది గులాబీజెండాతోనే ఉన్నట్టు మరోసారి నిరూపితమైందని వారంటున్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రయోజనాల కోసం. పదేండ్లు అన్నివర్గాల వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నం. ఇవాళ నా కండ్లముందే అవన్నీ పోతుంటే, బాధ కలుగుతున్నది. నేను ఒక్కటే మీకు చెప్తున్నా! బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగటం కోసం పోరాడుతానే తప్ప.. నోరు మూస్కోని కూర్చోను. వందకు వందశాతం బీఆర్ఎస్ మీతోనే, మీ ప్రయోజనాల కోసమే ఉంటది.
-కేసీఆర్
కొత్తవి రాకపోయినా.. ఉన్నవి ఊడగొడుతున్నరు. అందుకే ప్రజల చేతుల్లో ఓ అంకుశం కావాలె. ఒక హంటర్ కావాలె. రాష్ట్రంలో కాంగ్రెస్ మెడలు వంచి పనిచేయించే అంకుశం బీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది. చేవెళ్ల నుంచి ఓ పదునైన అంకుశం మన బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. అనుభవం ఉన్న వ్యక్తి. బలహీన వర్గాల వ్యక్తి. ఆశీర్వదించండి.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ప్రజలు, రైతుల చేతుల్లో ఉన్న ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ఎందుకు పడాలి? అందుకే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ మెడలు వంచి పనులు చేయించే అంకుశం కావాలి. అంటే కచ్చితంగా తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆ ప్రసంగం కేసీఆర్ మాటల్లోనే.. ‘రాజకీయాలు, ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ధీమా, ధైర్యం. మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అన్న విశ్వాసం ఉండాలి. ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ప్రజలు దీన్నే ఆశిస్తారు. యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వంపై ఆత్మవిశ్వాసం ఉండాలి. మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం ఉందన్న గౌరవమైన భావం ప్రజల్లో ఉండాలి. ఎన్నికలప్పుడే చాలా సభల్లో ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని, ఏ మాత్రం పొరపాటు జరిగినా దెబ్బతగులుతుందని చెప్పిన. కాంగ్రెస్ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలకు గురవటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఐదో నెల గడుస్తున్నది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ కనిపిస్తలేదు. ఉన్న వసతులు, వనరులను వాడుకొనే నైపుణ్యం కనిపిస్తలేదు. పదేండ్ల క్రితం మనం మరిచిపోయిన ఇబ్బందులు మళ్లీ కనిపిస్తున్నయ్.
దళితులను మోసం చేసిన కాంగ్రెస్ మెడలు వంచేందుకు స్వయంగా నేనే 1.30 లక్షల దళితబంధు లబ్ధిదారులతో అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేసి దళితబంధు ఇప్పిస్తా. ప్రభుత్వ మెడలు వంచుతం.. దళితబంధు డబ్బులను ఇప్పిస్తం.
-కేసీఆర్
15 ఏండ్లు పోరాటం చేసి మీ అందరి దీవెనతో, మద్దతుతో ఆనాడు ఖమ్మం జైలులో ఉండి దీక్ష చేసిన. ఆరోగ్యం పాడైతే నిమ్స్ దవాఖానలో 13 రోజులు దీక్ష చేసి చచ్చిపోయే స్థితిలో చావునోట్లో తలపెట్టి ఈ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులుండె. కరెంట్కోతలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, సాగునీటి, మంచినీటి సమస్యలుండె, రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉండె. దాన్ని నివారించాలని కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉంటే వారు రైతులు. అన్ని కులాల్లో రైతులుంటరు. వారిని కాపాడాలని, గ్రామాలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు కావాలని, పట్టుబట్టి ఐదు పథకాలు పెట్టాం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం. దేశంలోనే తొలిసారి రైతుబంధుతో ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా, మోటర్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు పేలకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేసినం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల్లోనే రూ.5 లక్షల బీమా ఇచ్చినం. రైతుల పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా నేరుగా ఖాతాల్లో డబ్బులేసినం. ఇలాంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపినం.
మౌనం మంచిది కాదు. సందర్భం వచ్చినప్పుడు స్పందించాలె. నోరు తెరిచి అడగాలె. పోరాటం చేయాలె. అప్పుడే ఏదైనా సాధ్యపడుతది.
-కేసీఆర్
అంబేద్కర్, జ్యోతిబాపూలే మార్గంలో నడిచి 1,100 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి జూనియర్ కాలేజీలుగా మార్చినం. కులం మతం లేకుండా దళితులు, గిరిజనులు, ముస్లింల కోసం పేద వర్గాలు, బలహీన వర్గాల కోసం గురుకులాలను ఏర్పాటుచేసినం. ఆర్ఎస్ ప్రవీణ్ వాటిని అద్భుతంగా నడిపిస్తే ఐఐటీలు, ఐఐఎంలలో, మెడిసిన్, ఇంజినీరింగ్లో వందలు, వేల మందికి సీట్లు వచ్చినయ్. ఓసీలు సహా అన్ని వర్గాలకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినం. దళిత, గిరిజన, బలహీనవర్గాల బిడ్డలు, ఓసీ బిడ్డలు ఓవర్సిస్ సాలర్షిప్ తీసుకొని విదేశాల్లో విద్యాభాస్యం కొనసాగిసున్నారు. ఈ రోజు ఇవన్నీ మాయమైనయ్. గత ఐదు నెలల్లో ఒక్క బిడ్డకూ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వలేదు.
దళిత వాడలు ధనిక వాడలు కావాలని దళితబంధుతో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టినం. ఏడాదికి లక్ష కుటుంబాలో, రెండు లక్షల కుటుంబాలో బాగుచేసుకోవాలని ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చినం. కేసీఆర్ 10 లక్షలిస్తే తాము 12 లక్షలిస్తామని కాంగ్రెసోళ్లు మాయమాటలు చెప్పిండ్రు. 1.30 లక్షల దళితబిడ్డలకు మేం దళితబంధు మంజూరు చేసినం. ప్రొసీడింగ్స్ ఇచ్చినం. డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపినం. రూ.12 లక్షలిస్తమని నమ్మబలికిన కాంగ్రెస్ ఈ రోజు ఒక్కరికీ ఇవ్వటం లేదు. 12 లక్షలు కాదు కదా.. 10 లక్షలైనా ఇవ్వటం లేదు. అకౌంట్లను ఫ్రీజ్ చేసి డబ్బులు వాపస్ తీసుకున్నరు. దళిత సమాజంలో ఉండే మేధావులు, యువత దీనిపై తీవ్రంగా ఆలోచించాలి. మౌనంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదు. పోరాటం చేయకుండా దళితబంధు డబ్బులు రావు. ఈ 1.30 లక్షల మందిని నేనే స్వయంగా తోడ్కోని వచ్చి సచివాలయం పక్కనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా. ఈ ప్రభుత్వ మెడలు వంచుతం.. దళితబంధు డబ్బులను ఇప్పిస్తం. దళిత బిడ్డలంతా మీ గ్రామాలు, పట్టణాలొకొచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. ఏమయ్యా..! మా దళితబంధు ఎక్కడ పోయింది? మా ప్రొసీడింగ్స్ ఎక్కడికి పోయినయ్? మాకు 12 లక్షలిస్తమన్నరు కదా.. ఎక్కడ పోయినయ్? అని అడగాలి.
కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు తులం బంగారం ఏడపోయింది? మొన్న సిరిసిల్లలో కూడా అడిగిన. ఈ ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే మారెట్లో దొరుకతలేదా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? కులవృత్తులపై ఆధారపడ్డ బిడ్డలకు గొల్లకుర్మలకు గొర్రెలు, గంగపుత్రులకు వందల కోట్లు వెచ్చించి చేపపిల్లలు పెంచాం. చేనేత కార్మికులకు పని కల్పించాం. సబ్సిడీలు ఇచ్చాం. గౌడ కులస్థులకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే పన్నును (రకాన్ని) వందకు వందశాతం రద్దు చేశాం. బలహీన వర్గాలకు బ్రహ్మాండంగా సహాయం చేశాం. బీసీబంధు పెట్టి బలహీన వర్గాలను ఆదుకున్నాం. వీటన్నింటిని ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగిస్తదా? శఠగోపం పెట్టిందా? వాళ్ల పాలసీ ఏంది? అని నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా.
కేసీఆర్ పకకు పోంగనే కరెంటు ఎందుకు మాయమైంది? దీనికి కారణమేంది? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీళ్లే(కాంగ్రెస్) మనకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. వీళ్లు కొత్తగా ఏం చేసే అవసరం లేదు. గత ప్రభుత్వం ఎట్ల నడిపిందో అట్ల నడిపిస్తే సరిపోయేది.
-కేసీఆర్
11 ఏండ్ల కిందట దారుణమైన పరిస్థితి ఉండేది. ఒకటింపావు సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి, రైతాంగానికి, ఇండ్లు, పరిశ్రమలు, ఐటీరంగానికి, అందరికీ 24 గంటల కరెంటు సరఫరా తొమ్మిదేండ్లపాటు ఇచ్చాం. దాన్ని కూడా సరిగా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఉన్నది. మిషన్ భగీరథ అద్భుత పథకం. ఐక్యరాజ్యసమితి మన్ననలు పొందినది. 10 -11 రాష్ర్టాలు మేం కూడా అమలుచేస్తామని ఇక్కడికి వచ్చి అభినందించిన పథకం. అలాంటిది ఇవాళ మంచినీటి కొరత ఎందుకొస్తున్నది? ట్యాంకర్లు ఎందుకొస్తున్నయ్? మళ్లీ బోర్లు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది ఎవరి తెలివితక్కువతనం? కరెంట్కు ఏం రోగమొచ్చింది? మరి ఎట్లా సరిచేయాలి? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓ నిర్ణయం తీసుకోవాలి. రేపు చేవెళ్లలో ఎంపీగా గెలిచే కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ.. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటది.
కాంగ్రెస్ సర్కారు ప్రతి క్వింటాల్కు రూ.500 బోనస్ కట్టివ్వకపోతే ఓట్ల డబ్బాల దగ్గర యుద్ధం చెయాలె. ఓట్లు గుద్దుడు గుద్దితే.. దెబ్బకు దిగిరావాలె. డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలె. బిడ్డా నువ్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఊర్కోము. తగిన గుణపాఠం చెప్తాం మీకు అని ఓట్లు గుద్ది నిరూపించాలి. బీజేపీకి ఓటేస్తే.. మీటర్లు పెట్టుమని మేం చెప్పంగ కూడా మాకే ఓటు వేసిండ్రు. పెట్టుర్రా ఇగ మీటర్లు అంటరు. మీటర్లు రావొద్దంటే బీజేపీని నేలకేసి గుద్దాలె. మనల్ని నూకలు తినుమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిపిద్దాం. అంటే బీఆర్ఎస్కు ఓటెయ్యాలె.
– కేసీఆర్
తస్మాత్ జాగ్రత్త! యావత్ తెలంగాణకు నా విన్నపం ఒక్కటే. ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నెరవేరాలంటే చిన్న లాజిక్. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షంతో మీరొక కొరడా ఝళిపిస్తేనే, మీరొక సురుకు పెడితేనే మీ పనులన్నీ అయితయ్. ఐదు నెలల కిందట అడ్డగోలు మాటలెన్నో చెప్పినా, ఎన్ని పంగనామాలు పెట్టినా, ఏ పాలసీ సరిగా లేకపోయినా, ఉన్నవి ఊడగొట్టినా, కరెంటు సక్కగా ఇవ్వకపోయినా, రైతుబంధు పడకపోయినా, పంటలు కొనకపోయినా, రూ.500 బోనస్ ఇవ్వకపోయినా కూడా మాకే ఓటేసిండ్రు.. మేము ఏం జేయకున్నా ఎవ్వరేం అనరు అన్న అభిప్రాయమొస్తది. మోసం చేసినా, అబద్ధపు వాగ్దానాలు చేసినా మళ్లీ తమనే గెలిపించారని అంటారు. మీకేమీ చెయ్యరు. అందుకే మీ ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కే వేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ కనిపిస్తలేదు. వసతులు, వనరులను వాడుకొనే నైపుణ్యం కనిపిస్తలేదు. పదేండ్ల క్రితం మనం మరిచిపోయిన ఇబ్బందులు మళ్లీ కనిపిస్తున్నయ్.
-కేసీఆర్
బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినం రంజిత్రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా? గౌరవించలేదా? గెలిపించలేదా? నేనే వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తే మీరే ఓటు వేయలేదా? ఇవాళ ఎందుకు పార్టీ మారిండు? దేని కోసం మారిండు? ఆయనేమన్నా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఏడుంటే అటు తిరుగుతడా? అధికారం కోసమా? పదవుల కోసమా? పైరవీల కోసమా? ఇట్లాంటి వ్యక్తులకు మీరే సమాధానం చెప్పాలి. ఇట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ఓటుతోనే దీటైన జవాబివ్వాలి.
అన్ని పంటలు కొంటామని కాంగ్రెస్ చెప్పింది. ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నది. జొన్నలు కొంటాం, కందులు కొంటాం, వడ్లు కొంటాం, మక్కలు కొంటామన్నది. వానకాలం పంటలకు ఏమీ ఇవ్వలె. ఇవాళ యాసంగి పంటలకు కూడా కొనుగోళ్లు ప్రారంభమైనయ్. పంటకు బోనస్ ఇస్తరా? ఇయ్యరా? ఇయ్యకపోతే ఊకుందామా? యుద్ధం చేద్దామా? ఈ యుద్ధం రెండు రకాలుగా చెయ్యాలె. ఒకటి పంట కొనుగోళ్ల దగ్గర చేయాలె. అక్కడ స్పందన రాకపోతే.. ప్రతి క్వింటాల్కు రూ.500 కట్టివ్వకపోతే.. రెండోది ఓట్ల డబ్బాల దగ్గర యుద్ధం చేయాలె. ఓట్లు గుద్దుడు గుద్దితే దెబ్బకు దిగిరావాలె. డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలె. బిడ్డా నువ్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఊర్కోం. తగిన గుణపాఠం చెప్తాం మీకు అని ఓట్లు గుద్ది నిరూపించాలి.
స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తున్నరు. స్కాలర్షిప్లు మాయమైనయ్. గత ఐదు నెలల్లో ఒక్క బిడ్డకూ స్కాలర్షిప్ రాలె.
-కేసీఆర్
నాడు అడ్డూఅదుపు లేకుండా 420 వాగ్దానాలు చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఎక్కడికిపాయె స్కూటీలు? దాని ప్రతిపాదనైనా ఉన్నదా? స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తున్నరు. హైదరాబాద్తో సహా భయంకరమైన లూటీ మొదలుపెట్టారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి మొదలుకొని యావత్తు తెలంగాణవ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండె? ఇయ్యాల భూముల ధరలు ఎక్కడికి పోయినయ్? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? దీని వెనకున్న బ్రోకర్లు, జోకర్లు ఎవరు? ఎందుకు బిల్డింగ్లకు అనుమతులు ఇస్తలేరు? లక్షల మంది పిల్లలు బతికిన రియల్ ఎస్టేట్ ఇవాళ ఎందుకు నాశనమైంది? ఇట్లే చూసుకుంటూ కూర్చుందామా? లేదా ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామా? ప్రజలే ఆలోచన చేయాలె.
వికారాబాద్, రంగారెడ్డి ఎన్నో పరిశ్రమలు తెచ్చుకున్నాం. చేవెళ్లను పెద్ద పరిశ్రమల కేంద్రంగా చేసే ప్రయత్నం చేసినం. షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నం. ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నం. చందన్వెళ్లిలో అమెజాన్ వంటి కంపెనీలు ఏర్పాటు చేసుకున్నం. సీతారాంపూర్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నం శ్రీమేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని చేవెళ్ల నియోజకవర్గంలో పెట్టుకున్నం. వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాల నీళ్ల కోసం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు తెచ్చుకున్నం. చేవెళ్ల-రంగారెడ్డి కోసం ఉద్ధండాపూర్ ప్రాజెక్టు కట్టుకున్నం. అది కూడా రాబోతున్నది. దానిపై ప్రభుత్వ పాలసీ ఏమిటో తెలియటం లేదు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం రాష్ర్ర్టాన్ని సాధించుకున్నాం. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, అనేక త్యాగాలు, లాఠీదెబ్బలు, జైళ్లు వగైరా తర్వాత రాష్ర్టాన్ని సాధించుకున్నాం. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యావత్తు తెలంగాణ ప్రజల పక్షాన డాక్టర్ అంబేద్కర్కు హృయదపూర్వక నివాళి అర్పిస్తున్నా. అంబేద్కర్కు దేశంలో ఎక్కడలేనంత సమున్నత గౌరవాన్ని ఇవ్వాలని మనం రెండు పనులు చేసినం. 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేసి దేశానికే సమున్నతంగా గౌరవించినం. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లల్లో ఏ రాష్ట్రం చేయనట్టుగా మన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టుకున్నం. ఇది అంబేద్కర్ మహనీయునికి మనం అర్పించిన నివాళి.
35-40 ఏండ్లుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసి, తన ఆస్తిని ధారపోసి, ఆర్గనైజ్ చేసి, బలహీనవర్గాల బిడ్డగా ఉన్న జ్ఞానేశ్వర్ మీకు సుపరిచితుడు. ఇక్కడ జిల్లా పరిషత్తు చైర్మన్గా పనిచేశారు. మీ అందరికీ సేవలు చేశారు. బీసీలకు దమ్ముంటే, పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి చూపండి అని నిన్న ఒక పెద్దమనిషి అన్నడు. ఇక్కడున్న బలహీనవర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు నేను మనవి చేస్తున్న. ఇవాళ అవకాశం ఉన్నది. ఒక బీసీ నాయకుడు, సమర్థుడు, సీనియర్ నాయకుడు ఉన్నడు కాబట్టి, ప్రజాసేవ చేసే గుణం ఉన్న వ్యక్తి ఉన్నడు కాబట్టి కచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు.. బీసీల అభివృద్ధికి మలుపు. ఇవాళ బీసీల శక్తి ఏందో, బీసీల రాజకీయ చైతన్యమేందో కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి రుజువు చేయాలని కోరుతున్నా. ఏ రకంగా చూసుకున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకిచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా, బలహీనవర్గాలు, బడుగులందరికి న్యాయం జరగాలన్నా, తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దారులు పడాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ గెలవాల్సిందే.
నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ధాన్యం వచ్చింది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతున్నయ్. తడిసిన ధాన్యం కూడా ఒక్క గింజ లేకుండా కొనాలె. రైతులకు న్యాయం చేయాలె. ప్రజలకు మీరిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేదాకా బీఆర్ఎస్ కచ్చితంగా మిమ్మల్ని వెంటాడి, వేటాడుతది. మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితే ఉండదు. ఇవాళ మూడు, నాలుగు వందల బస్సులు దాటుకుంటూ సభకు వచ్చిన. నాలుగైదు వందల బస్సులు ఇంకా ఇక్కడికి చేరనేలేదు. ఇంత పెద్దఎత్తున మీరు ఇక్కడికి తరలివచ్చారంటే కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమైందని సంతోషం వ్యక్తంచేస్తున్నా. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.