Gajwel | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘తిండి పెట్టినోన్ని ఎట్ల మర్చిపోత. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష ఇచ్చిండు. నా మూడు ఎకరాల భూమికి పైసలు పడుతున్నయి. అప్పట్ల ఏమున్నది, నీళ్లు లెవ్వు, కరెంటు లేదు. అద్దెకరం పొలం తడిశేది. ఇప్పుడు నీళ్లు ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు. పుర్సత్ గ పగటి పూట బాయి కాడికి పోయి పొలానికి నీళ్లు పెట్టుకొని వస్తున్న. గింతగనం చేశినోన్ని ఎట్ల మర్శిపోతం’. ఇదీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద మక కంకులు కాల్చుతున్న ఒక రైతు అభిప్రాయం. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పదేండ్లలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు మరోసారి తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చాటుకున్నట్టు స్పష్టమవుతున్నది.
నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది మండలాలు ఉండగా.. ఏడు మండలాల్లో కారు గుర్తు హవా కనిపించింది. కాంగ్రెస్ మొదటి నుంచి చేతులెత్తేసి నామమాత్రంగా మిగిలిపోగా.. బీజేపీ కేవలం ఒక వర్గం ఓట్లనే నమ్ముకున్నది. దీంతో వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలంతా అభివృద్ధి వైపే చూస్తున్నట్టు స్పష్టం అవుతున్నది. ‘పదేండ్ల కిందట గజ్వేల్లో ఏముందన్నా. రోడ్లు సకగున్నయా, కనీసం మోరీలు సకగున్నయా? ఉపాధి కావాలంటే హైదరాబాద్ పోయి బతికిన రోజులే కదా. ఇప్పుడు చూడు గజ్వేల్ మొత్తం మారిపోయింది. ఎడ్యుకేషనల్ హబ్గా తయారైంది. మేం కలలో కూడా ఊహించని స్థాయిలో రోడ్లు, బిల్డింగులు వచ్చాయి. పదేండ్లలోనే పట్టణం రెండింతలైంది. మాలాంటి యువకులకు ఇకడే ఉపాధి దొరుకుతున్నది’ అని గజ్వేల్ పట్టణంలో బుక్ డిపో నడుస్తున్న ఒక యువకుడు తెలిపారు. ఇంత చేసిన కేసీఆర్కు తప్ప మరి ఎవరికి ఓటేస్తమని ప్రశ్నించాడు.
మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఓట్లు సాధించినట్టు కనిపించినా.. గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ హవా స్పష్టంగా కొనసాగింది. కాంగ్రెస్కు అనేక గ్రామాల్లో పోలింగ్ ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. కొన్ని మండలాల్లో బీజేపీకి కూడా ఇదే పరిస్థితి. పోలింగ్ ఏజెంట్లు లేక, ఓటర్లను పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చే నాయకులు లేక రెండు పార్టీలు వెనుకబడ్డాయి. ఈ నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ విజయం మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు కనిపించలేదు. మెజార్టీ ఎంత అని చర్చ మాత్రమే జరిగింది.
గజ్వేల్ నియోజకవర్గం బరిలో ఎకువ మంది అభ్యర్థులు ఉండటంతో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. దీంతో నిరక్షరాస్యులు, వృద్ధులు కాస్త అయోమయానికి గురయ్యారు. ప్రధాన పార్టీల నేతలంతా తమ అభ్యర్థి, గుర్తు ఎన్నో నంబర్ బటన్ నొక్కాలో ఓటర్లకు డమ్మీ ఈవీఎంలను చూపించి వివరించారు. కానీ, మూడు ఈవీఎంలు ఉంటాయని, అందులో తమ అభ్యర్థి ఎకడ ఉంటాడో స్పష్టంగా చెప్పడంలో కాస్త విఫలం కావడంతో కొన్ని ఓట్లు చీలిపోయినట్టు తెలుస్తున్నది.