ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 22 : అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం తరహాలో భారత దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖాన, రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు సైతం నాణ్యతతో కూడిన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బస్తీ, పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందుతుందన్నారు.
ఎదులాబాద్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానకు తన సొంత నిధులు రూ. 2 లక్షలు వెచ్చించి పర్చీచర్ ఇప్పించిన ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అభినందనీయుడని మంత్రి తెలిపారు.