సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.84 లక్షల వ్యవసాయ భూములకు సాగు నీరు అందనున్నది. లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కావాల్సిన సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డీపీఆర్ ఆధారంగా జిల్లా నీటిపారుదల శాఖ అంచనాలు తయారు చేసి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సైతం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాల్వలు, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూ సేకరణ కొనసాగుతోంది.
నాలుగు నియోజకవర్గాల్లో 3.84లక్షల ఎకరాలకు నీళ్లు
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సింగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 3.84 లక్షల ఎకరాలకు నీరు అందనున్నది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 57వేల ఎకరాలు, జహీరాబాద్లో 1.06 లక్షల ఎకరాలు, అంధోల్లో 56వేల ఎకరాలు, నారాయణఖేడ్ సెగ్మెంట్పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు రెండు లిఫ్టుల ద్వారా సాగు నీరు అందనున్నది. కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా 4 నియోజకవర్గాలకు నీరందించే పనులు జరగనున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం రూ.4,427కోట్లు ఖర్చు చేయనున్నది. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ వద్ద బసవేశ్వర ఎత్తిపోతలు.. అంధోల్ నియోజకవర్గ పరిధిలోని రాయికోడ్ మండలం ఐదులాపూర్ వద్ద సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. వీటి ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అంధోల్ నియోజకవర్గాల్లోని 12 మండలాల్లోని 231 గ్రామాలకు సాగునీరందనుంది. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్, అందోల్నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 166 గ్రామాలకు నీరందనున్నది.