మహబూబాబాద్ : కేసీఆర్ కిట్స్ అంటే కేవలం 16 వస్తువుల పెట్టె కాదని, మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లా ఏరియా హాస్పిటల్ను మంత్రి సందర్శించారు. గత వారం రోజులుగా హాస్పిటల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్స్ అందించి, మహిళల కోసం ముఖ్యంగా బాలింతలు, గర్భిణుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించారు.
బాలింతలకు కేసీఆర్ కిట్స్ అందజేశారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ ను జిల్లా హాస్పిటల్గా అభివృద్ధి చేసుకున్నాం. గత వారం రోజులుగా దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ కిట్స్ అందించడం సంతోషంగా ఉందన్నారు.స్త్రీ, శిశు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక నినాదంతో జరుపుకోవడం ఒక ఆనవాయితీ. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణలో మహిళలంతా కేసీఆర్ మహిళా బంధు పేరుతో జరుపుకుంటూ ఈ మూడు రోజులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం విశేషమన్నారు.
ఈ సంబరాల్లో భాగంగా మహిళల కోసం, సమాజం కోసం పాటుపడిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆశలు, ఏఎన్ఎంలు సన్మానించుకుంటూ, గౌరవించు కుంటున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.