KCR | తమాషా కోసం బతుకమ్మ చీరెలు తేలేదని.. చేనేత కార్మికులకు బతుకునిచ్చేందుకే బతుకమ్మ చీరెలు తెచ్చామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరెలు తెచ్చాం. తమాషా కోసం తేలేదు. ఆ నాడు ఉద్యమంలో నేను.. ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రిపూట కార్ల లైట్లలో గోడలపై ఆత్మహత్యలు చేసుకోవద్దు.. చావు సమస్యలకు పరిష్కారం కాదు అని కనిపించాయి. వాటిని చూసి ఏడ్చినం. 60 స్వతంత్రంలో ఇవాళ చావులు, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నమంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకం అనుకున్నం’ అని కేసీఆర్ నాటి పరిస్థితులను గుర్తు చేశారు.
‘సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే.. పార్టీ నుంచి రూ.50లక్షలు తెచ్చి మీకు దండంపెడుతం ఓ ఏడాది వరకు సావకున్రి.. తెలంగాణ వచ్చేదాక బతకండి.. మేం మిమ్మల్ని బతికించుకుంటాం అని చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫాంలు.. పండుగలకు పేద మహిళలు బట్టలు కొనుగోలు చేయలేని వారి కోసం బతుకమ్మ చీరెలు తెచ్చి అందజేశాం. చేనేత మిత్రలాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్య ఆగిపోయాయి. పవర్లూం కార్మికులను కాపాడే ప్రయత్నం చేసినం. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని.. పేద వర్గాలను, రైతులను దృష్టిలో పెట్టుకొని చేశాం. వ్యవసాయ స్థిరీకరణ ఒక మాటలో చెప్పిన. దేశంలో ఎవరూ పిలువనటువంటి రైతుబంధు అని పేరుపెట్టి రైతుబంధు తీసుకువచ్చాం. 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం. ఈ సదుపాయంతో తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది’ అన్నారు.