సూర్యాపేట : తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్(CM KCR) ఒక్కరితోనే సాధ్యమని ఆయనే దేశానికి శ్రీరామ రక్ష అని కోదాడ ఎమ్మెల్యే(Kodada Mla) బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నియోజకవర్గంలోని మోతే మండలం సిరికొండ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మోదీని నిలువరించే , దేశాన్ని రక్షించగల నాయకుడు కేసీఆర్(KCR) అని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్(BRS) పార్టీ కి బలమని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి పల్లెకు అభివృద్ధి, ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమాన్ని అందించామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు. శ్రుతి మించుతున్న బీజేపీ(BJP) దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సీబీఐ(CBI), ఈడీ(ED), ఐటీ(IT) దాడులను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నాడో ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ , బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు, సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, అరె లింగారెడ్డి, ఏలూరి వెంకటేశ్వరరావు, కొండపల్లి వెంకటరెడ్డి, ముప్పాని శ్రీధర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరసింహారావు, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు కాంపాటి వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.