ఆర్మూర్ (నిజామాబాద్) : ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజలకున్న నమ్మకంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 450 సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ దేవుడని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మూడోసారి గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలన నచ్చడం వల్లే తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా పార్టీలోకి వలసల వరద కొనసాగు తోందన్నారు. 65 లక్షల మందికి రైతు బంధు ఇస్తున్నారని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేశారని , మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.
సబ్బండవర్గాల అండదండలు గులాబీ జెండాకే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని, కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు దేశాన్ని పీడించే భూతాలుగా మారాయని ఆరోపించారు. దేశ సంపదను నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రోద్భలంతో ఆదానీ ఆవిరి చేస్తున్నాడని మండిపడ్డారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో..
ఆర్మూర్ నియోజకవర్గం బీజేపీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నికాల్పూర్ గ్రామ లిఫ్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు జిలకర చిన్నయ్య తో పాటు వైస్ చైర్మన్ సాయిలు, లిఫ్ట్ డైరెక్టర్లు సుమన్, లంబడి గంగారం, శాల చిన్న ముత్తెన్న, సుంకరి పెద్ద చిన్నయ్య, పస్కా పెద్ద గంగాధర్, నాగరాజు, గొల్ల శ్రీకాంత్, తెనుగు చిన్న గంగారం, సంతోష్, బద్దం సాయి రెడ్డి తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, నికాల్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మల్ రాజన్న, కేజీ సురేష్, బీ ఆర్ గంగాధర్ పాల్గొన్నారు.