అందరినీ ఒకేతాటిపైకి తీసుకురాగలరు
ముందుండి నడిపించే సత్తా ఆయనకు ఉంది
రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు
ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కష్టపడుతారు
కేసీఆర్పై శివసేన ఎంపీ సంజయ్రౌత్ ప్రశంసలు
నాగపూర్, ఫిబ్రవరి 21: బీజేపీ, కాంగ్రెసేతర నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చి ముందుడి నడిపించగల సత్తా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు ఉన్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన కేసీఆర్.. కష్టపడి పనిచేసే నాయకుడని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎల్లప్పుడూ కృషిచేస్తారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం నాగ్పూర్లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని రౌత్ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీల నేతలను ఒకేతాటిపైకి తీసుకురావడంలో భాగంగా కేసీఆర్ ఆదివారం చేపట్టిన మహారాష్ట్ర పర్యటన దిగ్విజయవంతమైంది. బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు దేశ భవిష్యత్తుకు మూడో పక్షం అవసరాన్ని నొక్కిచెప్పిన కేసీఆర్ ఇదే విషయంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్తో సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం.. కేసీఆర్తో కలిసి పనిచేయడం తమకు ఇష్టమేనని, బీజేపీ-కాంగ్రెసేతర పక్షాన్ని నడుపడానికి, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి కేసీఆర్ వంటి నాయకుడు అవసరమని ఠాక్రే, పవార్ పేర్కొనడం విదితమే.