బాన్సువాడ, డిసెంబర్ 2: ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని, 70 నుంచి 75 సీట్లు సాధించనున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని, ఆయన నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టం చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మవద్దో తెలంగాణ ప్రజలకు తెలుసని, వారికి కేసీఆర్పై అత్యంత విశ్వాసం ఉన్నదని అన్నారు. అందుకే గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని తెలిపారు. స్థిరమైన, బలమైన ఓటు బ్యాంకు బీఆర్ఎస్కే ఉన్నదని చెప్పారు.
కరోనాతో ప్రపంచమంతా అస్తవ్యస్తమైన తరుణంలోనూ కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమం ఆపలేదని, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా చూసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నందునే కేసీఆర్ నాయకత్వంలో తామంతా అఖండ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొన్ని సంస్థలు వారికి అనుకూలంగా ఉండే పార్టీలు గెలుస్తాయని ఎగ్జిట్పోల్స్ రూపంలో చూపిస్తున్నాయని, కానీ, ఎగ్జిట్ పోల్కు, ఎగ్జాస్ట్ పోల్కు చాలా తేడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ను నమ్మాల్సిన అవసరం లేదన్న సూచించారు. పోలింగ్ అయిన అరగంటకే ఫలితం ఎలా తెలుస్తుంది?, ఏ అంచనా ప్రచారం ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అసలు ఫలితాలు ఆదివారంతో తేలిపోతాయని, నూటికి నూరు శాతం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని అన్నారు. కేసీఆర్ లేకుంటే కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఆగిపోతాయని ప్రజలందరికీ తెలుసని అన్నారు. పేదవాడి సంక్షేమం, రైతు సంక్షేమం, ప్రాంత అభివృద్ధి నిలిచిపోతుందన్న పోచారం.. ప్రజలు ఎవరు తమ కళ్లను పొడుచుకోరని అన్నారు.
ఈమెలా ఆలోచించేవారు లక్షల మంది..
‘నేను బాన్సువాడలోని ఓ పోలింగ్ బూత్లోకి వెళ్లి వస్తున్న క్రమంలో రాజవ్వ అనే వృద్ధురాలు తారసపడింది. సారూ, నన్ను గుర్తుపట్టినవా? అంటే గుర్తుపట్టిన అని చెప్పిన. మేం కడుపునిండా అన్నం తినేలా చేసిండ్రు. మేము మిమ్మల్ని ఎట్ల మర్చిపోతం. కారుగుర్తుకు ఓటేసిన. వేరోళ్లు పైసలు ఇస్తే కూడా తీసుకోలేదు’ అని రాజవ్వ చెప్పిందని స్పీకర్ వివరించారు. ఇలా లక్షల మంది ఆశీర్వాదం కేసీఆర్పై ఉన్నదని, డబ్బులు పంచినంత మాత్రాన ఓట్లు పడ్డాయని, తామే గెలుస్తున్నామని కొందరు చెప్పుకోవడం సరికాదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉత్తుత్తి హామీలను ప్రజలు నమ్మలేదని అన్నారు.