నల్గొండ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి , ఆలోచనలను, ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని మర్రి గూడ బైపాస్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కరని ప్రశంసించారు. అన్నివర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్నారు. ప్రజలంతా ఆర్థికంగా,సామాజిక పరంగా సమానత్వం సాధించడమే అంబేద్కర్ లక్ష్యమని అన్నారు. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేశ్, మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణా చారి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.