హైదరాబాద్ : తెలంగాణలో బీసీలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రులు అన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి తదితరులు 13 కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు చేయూతనిచ్చారని తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా కోట్లాది రూపాయల విలువైన భూమి, కోట్ల రూపాయల నగదు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కండ్లముందు కనిపిస్తుందని, నిత్యం బీసీల అభ్యున్నతి కోసం తపించే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
గతంలోని పాలకులు బీసీలను ఓటర్లుగానే పరిగణించి ఎన్నికల్లో వాడుకున్నారని ఆరోపించారు. నాడు వెనుకబడిన తరగతులను వెనుకబాటు తనానికి గురిచేశారని విమర్శించారు. బీసీ విద్యార్థుల కోసం 15 గురుకులాలు ఉండగా నేడు 300 గురుకులాలు ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియా విద్యను అందచేస్తున్న సీఎం కేసీఆర్ను అభినందించారు. బీసీ బిడ్డల కండ్లలో ఆనందం చూడాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున వందల కోట్లాది రూపాయల విలువగల స్థలాలను బీసీలకు అందజేసి భవనాలను నిర్మించి ఇస్తుందన్నారు. వచ్చే దసరా పండుగ నాటికి భవనాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. భావితరాలు గుర్తించే విధంగా బీసీలు ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.