హైదరాబాద్: కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని చెప్పారు. కేసీఆర్ ది తెలంగాణ ప్రజలది తల్లీబిడ్డల బంధమని తెలిపారు. 1969 మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ వయసు 15 ఏండ్లని, అప్పుడే జై తెలంగాణ అని నినదించిన నాయకుడని చెప్పారు. వేల గంటల మేధోమథనం తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ కోసం అన్ని పదవులు త్యాగం చేసిన నాయకుడని తెలిపారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో విపక్ష నేత మధుసూధనా చారితో కలిసి భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ఎంతోమంది మేధావులు కేసీఆర్ వెంట నడిచారన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ను ఎన్నో రకాలుగా వేధించారని చెప్పారు. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ మొండి పట్టుదలే కారణమని తెలిపారు.
తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవయాత్రనో అంటూ ఆమరణ దీక్షకు దిగారని గుర్తుచేశారు. కేసీఆర్ దీక్షకు దిగివచ్చిన కేంద్రం తెలంగాణ ప్రకటించిందని వెల్లడించారు. తెచ్చుకున్న తెలంగాణను అద్భుతంగా తయారు చేసిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. మా కేసీఆరే మళ్లా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్, తెలంగాణ ప్రజల నడుమ ఉన్నది పేగుబంధమని చెప్పారు. రేవంత్ రెడ్డి తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్రమంతా పండుగలా జరుపుకుంటున్నారు.
Live: తెలంగాణ భవన్ లో జరుగుతున్న కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి @BRSHarish గారు. #HappyBirthdayKCR https://t.co/6ZYOVKdQcv
— Office of Harish Rao (@HarishRaoOffice) February 17, 2025