హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో మన బతుకులు, ఇక్కడి పరిస్థితులు ఎట్లుండెనో.. ఇప్పుడు ఎట్లున్నయో ఎవరికి వారు ఆలోచించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. నాడు తాగు, సాగు నీళ్లు, కరెంటు.. ఇలా ప్రతి రంగంలో సమస్యలే ఉండేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలోనే అన్ని సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. కుల వృత్తులకు జీవంపోసి, అన్ని వర్గాలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బుధవారం నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఏ ఆడబిడ్డను అడిగినా చెప్తారు
కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో రాష్ట్రంలో ఏ ఆడబిడ్డను అడిగినా చెప్తారని కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని అన్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొడుతూ ఇంటిముందు నల్లా పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. గత 75 ఏండ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నల్లా నీళ్లు ఇచ్చిన మొదటి సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.
కరెంట్ గోస, నీళ్ల గోస తీర్చుకున్నం
గతంలో ఊళ్లలో ఎవరైనా చనిపోతే.. కరెంటోళ్లకు ఫోన్ చేసి ఓ అర్ధగంట సేపు కరెంట్ ఇయ్యన్నా.. స్నానాలు చేయాలని బతిమిలాడుకున్న రోజులను కేటీఆర్ గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రోజూ కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్ లేవని, సతాయించే కరెంటోళ్లు లేరని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ, ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. గత 67 ఏండ్లలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను ఈ 8 ఏండ్లలో పరిష్కరించుకున్నామని తెలిపారు. పేదవారికి ఊతమై వారికి అండగా ఉంటూ రూ.200 పెన్షన్ను రూ.2 వేలకు పెంచకున్నామని తెలిపారు.
పుట్టింది మొదలు.. చదువుకునే వరకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని మంత్రి తెలిపారు. ఒక పేదింట్లో ఆడపిల్ల పుట్టింది మొదలు విదేశాల్లో చదువు పూర్తయ్యేంత వరకు కూడా ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నదని చెప్పారు. ఆడపిల్ల పెండ్లయితే కళ్యాణలక్ష్మి, అదే ఆడబిడ్డ ప్రసవానికి వెళితే కేసీఆర్ కిట్, ఆ బిడ్డ చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండమైన వసతులు, ఆ బిడ్డ ఇంకా చదువుకుంటానంటే విదేశీ విద్యకోసం జ్యోతిబా పూలే పథకంతో రూ. 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వివరించారు. బలహీనవర్గాలు, బీసీల కోసం ప్రత్యేకంగా 978 గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాల పిల్లలకు ఉన్నతమైన చదువులు అందించేందుకు గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు.
టాటాలే కాదు.. తాతల వృత్తులను కాపాడాలి
పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదని, తాతల నాటి కులవృత్తులు కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నాడు ధ్వంసమైన అన్ని కులవృత్తులకు నేడు పూర్వ వైభవం తీసుకువచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కుల వృత్తులకు పూర్వవైభవం మత్స్యకారులతో ప్రారంభమైందని తెలిపారు. రూ.1000 కోట్ల బడ్జెట్తో 75శాతం సబ్సిడీతో అనేక కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 63 వేల మంది మత్స్యకారులకు లూనాలు, మోపెడ్లు పంపిణీ చేసిన విషయాన్ని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రూ. 110 కోట్లు ఖర్చు చేసి 88 కోట్లకు పైగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని, తద్వారా మత్స్య సంపదను మత్స్యకారులకే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన చర్యలతో రాష్ట్రంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా దక్కిందన్నారు.
ప్రశంసించిన కేంద్రం, రాష్ట్రాలు
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ర్టాల నేతలు, కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పథకాలు అనుసరణీయమని, ఇక్కడ ఉన్న పథకాలు మరెక్కడా అమలుకావడం లేదని కితాబిస్తున్నారని చెప్పారు. భారతేదశం మొత్తంలో ఇన్లాండ్ ఫిషరీస్లో అతి స్వల్ప సమయంలో అగ్రభాగానికి చేరుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ప్రతి కులవృత్తికి అండగా ఉన్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి మొఖంలో చిరునవ్వు చూడాలనుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. సందర్భం ఏదైనా సరే చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రవి, వెంకన్న, హరినాథ్, నర్సింహ, జడ్పీటీసీ స్వరూప రవి, చంద్రకళ, తోకల వెంకన్న, శ్రీనివాస్, జగన్, సామల హేమ, బన్నాల గీత తదితరులు పాల్గొన్నారు.