Minister Gangula | సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆడబిడ్డల దీవెనలు ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట ఎల్ఎండీ కాలనీలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రసమయిని రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపించుకోవాలన్నారు.
తెలంగాణ ఆడబిడ్డ కవితక్కకు బంగారు భవిష్యత్తు ఉండాలన్నారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. నిరుపేదేంటి ఆడబిడ్డల వివాహాల కోసం అయిన వారే పట్టించుకోని రోజులు వివాహం చేసేందుకు భూములను కుదువ పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసిన రోజులు ఉండేవని గుర్తు చేశారు. చివరకు చేసిన అప్పులు చెల్లించలేక భూములను అమ్ముకున్న దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ, నిరుపేదింటి ఆడబిడ్డ వివాహం కోసం సీఎం కేసీఆర్ మేనమామగా కల్యాణలక్ష్మి పథకం పేరుతో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం దక్కిందని, తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం కోసం కల్యాణిలక్ష్మి ఆసరా పింఛన్లు ఇతర కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. తెలంగాణ ఆడబిడ్డ కన్నీరు పెడితే రాష్ట్రానికి శాపమని ఆడబిడ్డలు కన్నీరు పెట్టకుండా చూసుకుంటున్నారని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, తెలంగాణ ఆడబిడ్డ కవితక్కను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదని, శాపంగా మారుతుందన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించి, దీవెనార్థులు అందించాలని పిలుపునిచ్చారు.