Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, మార్చి 10: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటగూడ.. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు రాగా.. ప్రస్తుతం గుక్కెడు నీటి కోసం తండ్లాడుతున్నది. చివరకు ఎవరో వస్తారని ఎదురుచూడకుండా కొలాం గిరిజనులంతా ఏకమై బావి తవ్వుకుంటున్నారు.
పాటగూడలో 40 ఇండ్లు ఉండగా.. దాదాపు 240 వరకు జనాభా ఉంది. 500 వరకు ఆవులు, మేకలు తదితర జీవాలున్నాయి. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి రోజూ తాగునీరందించారు. ప్రస్తుతం ‘మిషన్ భగీరథ’ నిర్వహణ సరిగా లేక.. మరమ్మతులు చేపట్టక నీరందడం లేదు. ఇక చేసేదేమీ లేక గిరిజనులు అష్టకష్టాలు పడుతూ గ్రామ పొలిమేరలో ఉన్న బావి వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. వేసవి రావడంతో ప్రస్తుతం ఆ బావిలో నీళ్లు కూడా అడుగంటి పోతున్నాయి.
కలిసికట్టుగా బావి తవ్వకం
ప్రస్తుత వేసవిలో తాగునీళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న వాగులో గ్రామస్థులంతా కలిసి కొత్తగా బావి తవ్వుకుంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా బావి తవ్వకంలో పాలుపంచుకుంటున్నారు. నిత్యం తెల్లవారు జామున 4 గంటలకు నిద్ర లేవడం.. ఇదివరకు ఉన్న బావి వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం.. హడావుడిగా ఇంటి పనులు పూర్తి చేసుకోవడం.. ఆపై వాగులో బావి తవ్వడం తప్ప మరే పనిచేయడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ట్యాంకులకు మరమ్మతులు చేపట్టి తాగునీరు సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.
అందరం కలిసి బావి తవ్వుకుంటున్నం
మా ఊరిలో తాగునీటికి మస్తు తిప్పలైతాంది. మా ఊరి శివారులోనున్న బావి వద్దకు కాలినడకన వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం. అందులో నీళ్లు కూడా అడుగంటిపోతున్నయి. మరో పదిహేను రోజులు పోతే బావి ఎండిపోతుంది. అందుకే ఊరంతా కలిసి వాగులో కొత్త బావి తవ్వుకుంటున్నం. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా నీళ్లిచ్చిన్రు. మూడు నెలల సంది తాగునీరు రావట్లేదు.
-ఆత్రం సీతాబాయి, పాటగూడ
సార్లు స్పందిస్తే ఈ బాధుండదు
కేసీఆర్ సర్కారులో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లచ్చినయి. తాగునీటికి బాధే లేకుండే. ఖరాబైందని ఏడాది సంది నీళ్లిత్తలేరు. అధికారులేమో పట్టించుకుంటలేరు. తెల్లవారు జామున 4 గంటల నుంచే నీళ్ల కోసం తిప్పలైతాంది. ఇప్పుడున్న బావి ఎండిపోతాంది. రాబోయే రోజుల్లో ఇబ్బందైతదని అందరం కలిసి కొత్త బావి తవ్వుకుంటున్నం. సార్లు స్పందించి మిషన్ భగీరథ నీళ్తిస్తే మాకీబాధుండదు.
-సిడాం మీరాబాయి, పాటగూడ