KCR | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుడిని కేసీఆర్ ప్రార్థించారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటారని తెలిపారు.
దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణనాధుని నవరాత్రి వేడుకలు, పల్లె నుంచి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి పర్వదినం నుంచి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టితత్వం మరింతగా బలపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు.