హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో సంక్రాంతి వైభవం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో నిండి ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
దక్షిణం నుంచి ఉత్తరాయనానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి పర్వదినం.. హిందూ శాస్త్ర పురాణాల్లో ప్రత్యేకతను సంతరించుకున్నదని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవసాయాభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న కేసీఆర్.. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతాంగ సంక్షేమం తిరిగి గాడినపడి, తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.