KCR | అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణలో.. నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లు కొనుక్కునే దౌర్భాగ్యం వస్తదనుకోలేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మిషన్ భగీరథ పట్టించుకునే నాథుడే లేడు. నేను రెండుమూడు జిల్లాల ఇంజినీర్లను అడిగాను. నిర్మించింది మీరే.. నడిపింది మీరే ఇప్పుడేమైందని అడిగితే.. సార్ ఇందులో అసలు కిటుకు వేరే ఉన్నది. అడిగేవాడు లేడు.. మీ ఆఫీసులో స్మితా సబర్వాల్ అనే సెక్రెటరీ సఫరేట్గా ఉండేవారు. ప్రతిరోజూ మానిటరింగ్ చేస్తుండే. ఎక్కడున్నా ఆమె గద్దలా వచ్చివాలి అందరు ఇంజినీర్లను తీసుకువచ్చి సమీక్షస్తుండేది.
బ్రహ్మాండంగా జరుగుతుండేది. చిన్న పైపు పోయినా తెల్లవారేలోగా మళ్లీ వేసేవారు. ఇవాళ 15 రోజులైనా పట్టించుకునే పరిస్థితి లేదని చెబుతున్నరు. మిషన్ భగీరథ నీళ్లు కరెంటు రావాలంటే.. నాణ్యత గల కరెంటు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. ఈ ప్రభుత్వం తెలివితక్కువ తనం వల్ల మళ్లీ ఇవాళ లక్షల మోటార్లు కాలిపోతున్నయ్. ఒక్కో రైతు మోటారు రెండుమూడు సార్లు కాలిపోతున్నాయి. ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నయ్. ఇంకా మూడు నెలలు గడవాలి. జూన్ చివరిపోతే తప్పా ఊటలు రావు. అది భగవంతుడు కరుణించి వర్షాలు కురిస్తే మళ్లీ నీటి ఊటలు వస్తయ్. మూడు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటది. నేను బాధతో.. దుఃఖంతో మాట్లాడుతున్నా. అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణ నాకండ్ల ముందే నాశనమైతది అనుకోలేదు’ అన్నారు.
‘నేను బాధతో మాట్లాడుతున్న.. అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణ.. 100 రోజుల్లో నా కండ్ల ముందే ఇంత నాశనమైతది. నా కండ్ల ముందే బిందెలు పట్టుకుని తిరుగుతరు.. నా కండ్ల ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తది.. నా కండ్ల ముందే ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం వస్తది అని నేను అనుకోలేదు. ఏ కారణంతో నీళ్లకు షాటేజీ వచ్చింది? హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైన్ ఉంది.. సంవత్సరానికి 12 టీఎంసీ వస్తది.. కృష్ణా నుంచే ఫేజ్ ఉందని.. సాగర్లో 100 టీఎంసీల పైచిలుకు డెడ్ స్టోరేజీ ఉంటదని.. పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును మంజూరు చేశాం. మా ప్రభుత్వం పోయేనాటికే 70-75 శాతం పనులు కూడా అయిపోయాయి. మొన్న కాంట్రాక్టర్ను అడిగితే.. ఈ గవర్నమెంట్ చెబితే రెండు మూడు నెలల చేసి అందిస్తామని చెప్పారు. ఒక్కసారి అది పూర్తయితే నీటి సదుపాయానికి ఢోకా ఉండదు. సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం వాడుకునే పరిస్థితి ఉంటది. ఇవేవీ చేయకుండా.. సమీక్షలు లేకుండా.. అడ్డగోలు మాటలు.. పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే చిల్లర టాక్టిక్స్ తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.