CM KCR | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి.. ఇది అవరోధాలను అధిగమించిన పోరాటఫలం. ఇది కుట్రలను ఛేదించిన సంకల్పబలం. ఇది కేసీఆర్ అవిశ్రాంత కృషి ఫలితం. పల్లానికి ప్రవహిస్తున్న గోదావరిని ఆకాశదిశన అర కిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లిన జలవిధాత కేసీఆర్.. ఇప్పుడు కృష్ణానదిని కరువునేలపై వంపనున్నారు. ఇనుపగజ్జెల తల్లి తిరుగాడిన చోట.. ఇప్పుడు కృష్ణమ్మ జలతాండవం చేయబోతున్నది. ఇది తెలంగాణ తలరాత మార్చుతున్న (భా)రీడిజైనింగ్! పాలమూరుకు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40కి పైగా కేసులు వేసి ప్రాజెక్టుకు పురిట్లోనే గొంతునులిమే ప్రయత్నం చేసింది. ద్రోహం తలపెట్టిన కేంద్రం, పగబట్టిన ఏపీ సర్కారు.. అడుగు ముందుకు పడకుండా అడుగడుగునా అడ్డుకున్నాయి. అన్నింటికీ ఎదురొడ్డి పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు సాధించడం.. కేసీఆర్ ప్రభుత్వ చారిత్రక విజయం. 70 ఏండ్ల నడిగడ్డ తండ్లాటకు తెరదించుతూ ప్రాజెక్టు ఇక పరుగులందుకోనున్నది. దక్షిణ తెలంగాణలోని 12.3 లక్షల ఎకరాలకు ఇది మరో కాళేశ్వరం కానున్నది.
తెలంగాణను ఏపీలో విలీనం చేయడం వల్ల అత్యధికంగా నష్టపోయింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. కండ్లముందు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా చెల్కలు ఎండిపోతున్న దయనీయస్థితి. ఫలితంగా వలసల జిల్లాగా మారిపోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో 70 ఏండ్ల తండ్లాటకు తెరపడింది.అడ్డంకులను అధిగమించి కృష్ణమ్మ నడిగడ్డపై పరుగులు తీసేందుకు మార్గం సుగమమైంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు సాధించటంతో యావత్ తెలంగాణ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది దాదా పు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. జిల్లాలో 35 లక్షల ఎకరాలకుపైగా సాగు యోగ్యమైన భూములున్నాయి. అప్పర్ కృష్ణా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో దాదాపు 7లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాటి నిజాం రాజు ప్రణాళికలు రూపొందించారు. కానీ, అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ చేసిన పాప ఫలితంగా పాలమూరు పడావు పడింది. తెలంగాణను ఏపీతో కలుపటంతో నిజాం ప్రణాళికలన్నీ కొత్తగా వచ్చిన సమైక్య పాలకులు బుట్టదాఖలు చేశారు.
దీంతో కృష్ణా ఒడ్డునే ఉన్నా నీళ్లు లేక పాలమూరు ఒట్టిపోయింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బలంగా గళాన్ని వినిపించారు. 2005లో పాలమూరు-రంగారెడ్డి పథకానికి రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రూపకల్పన చేయగా కేసీఆర్ మద్దతుగా నిలిచి పోరాటాలు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు సర్వే పనులకు జీవో ఇవ్వడానికి సైతం అనేక అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ ఉద్యమ ధాటికి, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఒత్తిడితో ఎట్టకేలకు అయిష్టంగానే 2013లో ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. అయినా తెలంగాణ ఏర్పాటయ్యేవరకు ఆ పనులు ముందుకు సాగకుండా అడ్డుకొన్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి పాలకులు 8.8 లక్షల ఎకరాలతో జూరాల నుంచి ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మార్పులు చేసి ఆయకట్టును 12.30 లక్షల ఎకరాలకు పెంచారు. ఇన్టేక్ పాయింట్ను శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చా రు. 2015లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఉమ్మడి ఏపీని ఏర్పాటు చేసి పాలమూరుకు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీయే, అటు తరువాత పాలమూరుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులకు కృష్ణాలో నికర జలాలను కేటాయించకుండా గొంతు నులిమింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా నడిగడ్డను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఎత్తిపోతల పనులు చేపట్టగానే ప్రాజెక్టును ఆపేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోర్టుల్లో, ఎన్జీటీలో దాదాపు 40 కేసులు వేయించింది. కాంగ్రెస్ నేత నాగం జనార్దన్రెడ్డి సైతం 2019లో ప్రాజెక్టును నిలుపుదల చేయాలం టూ సుప్రీంలో పిటిషన్ వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని ఎన్జీటీలో పిటిషన్లు వేయించింది.
‘పాలమూరు రంగారెడ్డి’పై ఏపీ సర్కారు పగబట్టిందనే చెప్పాలి. మొదటినుంచీ ప్రాజెక్టుపై ముప్పేట దాడి చేస్తున్నది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వరాదని కేంద్ర జల సంఘానికి, పర్యావరణ మంత్రిత్వశాఖకు లేఖలు రాసింది. డీపీఆర్లను కూడా పరిశీలించవద్దని కేంద్రానికి, రివర్ బోర్డును కోరింది. ఎన్జీటీలోనూ కేసులు వేసింది. అక్కడి రైతులతోనూ కేసులు వేయించింది. తర్వాత ఆ కేసుల్లో ప్రభుత్వం నేరుగా ఇంప్లీడ్ అవడం గమనార్హం. సదరన్ జోనల్ కమిటీ సమావేశాల్లో ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తూ వస్తున్నది. సుప్రీంను ఆశ్రయించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ 2లోనూ మధ్యంతర పిటిషన్ వేసింది. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికరజలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికీ కొర్రీలు పెడుతూనే ఉన్నది.
9 ఏండ్లుగా కేంద్రం విద్రోహం
ఏపీ చర్యలన్నింటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇతోదికంగా వత్తాసు పలుకుతూ వస్తున్నది. అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ వేసి నదీ జలాలను పునఃపంపిణీ చేపట్టాలని తెలంగాణ 9 ఏండ్లుగా కోరుతున్నా ఇప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలను చేపట్టలేదు. అదీగాక నికర జలాలున్న ప్రాజెక్టులకే అనుమతులు ఇచ్చేలా కొత్తగా సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు రూపొదించింది. అక్కడితో ఆగకుం డా రివర్ బోర్డుల గెజిట్ను విడుదలచేసి అందు లో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చి మరో ద్రోహానికి పూనుకొన్నది. 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవడం తప్పనిసరని షరతులు విధించింది. పర్యావరణ అనుమతుల కోసం ప్రాజెక్టు డీపీఆర్ను గత ఏడాది సెప్టెంబర్ 13న తెలంగాణ కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించగా, ఏపీ అభ్యంతరాలను సాకుగా చూపుతూ జాప్యం చేసింది. ఎట్టకేలకు తెలంగాణ ఒత్తిడితో కేంద్రం దిగిరాక తప్పలేదు.
ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా సీఎం కేసీఆర్ దృఢసంకల్పంతో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నారు. ప్రాజెక్టు పనులకు మొదటి దశ పర్యావరణ అనుమతులను సాధించిన అనంతరం రెండో దశ అనుమతులు తీసుకో
వాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ఏపీ, కాంగ్రెస్ నేతల కుట్రలతో ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ స్టే విధించడంతోపాటు జరిమానా సైతం పడింది. ఆయా తీర్పులను సుప్రీంలో తెలంగాణ సవాల్ చేసి నిలుపుదల చేయించింది. ప్రాజెక్టు ఆవశ్యకతపై బలమైన వాదనలను వినిపించి స్టేను ఎత్తేయించి పనులు ముందుకు సాగేలా చూసింది. అయితే కేసుల నేపథ్యంలో పర్యావరణ అనుమతుల పొందడం తప్పనిసరిగా మారింది. మరోవైపు కేంద్ర రివర్ బోర్డు గెజిట్ అడ్డంకిగా మారింది. అయినా సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకుపోవడం విశేషం. తొలుత కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టుకు నికర జలాలను కేటాయించారు. పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45 టీఎంసీల ను, మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 టీఎంసీల్లో వినిగించకుండా ఉన్న 45 టీంఎసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల నికర జలాలను ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. వెంటనే ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధంచేసి నిరుడు సెప్టెంబర్ 13న కేంద్ర పర్యావరణ శాఖకు పంపారు. సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రజత్కుమార్, ఈఎన్సీ హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, సీఈ హమీద్ఖాన్కు ఎప్పటికప్పుడు సూచనలు చేస్త్తూ అనుమతుల ప్రక్రియను పర్యవేక్షించారు. ఢిల్లీలో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటుచేశారు.
కేసీఆర్ వల్లే సాధ్యమైంది:తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
పాలమూరు ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ సిఫారసు చేయడంపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యాంప్రసాద్రెడ్డి, తన్నీరు వెంకటేశం హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు.
కెనాల్ నెట్వర్క్
వెంకటాద్రి రిజర్వాయర్
మెయిన్ కెనాల్ పొడవు: 133 కి.మీ.
ఆయకట్టు జిల్లాలు: మహబూబ్నగర్,
రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ
కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్
లోలెవెల్ కెనాల్ పొడవు: 21 కి.మీ.
హై లెవెల్ కెనాల్: 124 కి.మీ.
రైట్ మెయిన్ కెనాల్ పొడవు: 10 కి.మీ.
ఆయకట్టు జిల్లాలు: మహబూబ్నగర్
ఉద్ధండాపూర్ రిజర్వాయర్
సౌత్ మెయిన్ కెనాల్: 24 కి.మీ.
లెఫ్ట్ మెయిన్ కెనాల్: 120 కి.మీ.
హన్వడ కెనాల్: 20 కి.మీ.
మద్దూర్ కెనాల్: 90 కి.మీ.
1 రైట్ కెనాల్: 100 కి.మీ.
2 రైట్ కెనాల్: 93 కి.మీ.
ఆయకట్టు ఉన్న జిల్లాలు: మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ,నాగర్కర్నూల్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఫేజ్ -2 (సాగునీటి కోసం)
మొత్తం ఆయకట్టు ; 12.30 లక్షల ఎకరాలు
వినియోగించే జలాలు ; 75.94 టీఎంసీలు
రిజర్వాయర్లు ; 5
అంజనగిరి ; 8 .51 టీఎంసీలు (నార్లాపూర్)
వీరాంజనేయ ; 6.55 టీఎంసీలు (ఏదుల)
వెంకటాద్రి ; 16.74 టీఎంసీలు (వట్టెం)
కురుమూర్తిరాయ ; 17.34 టీంఎసీలు (కరివెన)
ఉద్ధండాపూర్ ; 16.03 టీఎంసీలు