KCR | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
100 మందికి పైగా వలంటీర్లు
యాత్ర పొడవునా భారీ జన సందోహం రానుండటంతో రోడ్ షోల్లో ఎలాంటి తొక్కిసలాట, గందరగోళం ఏర్పడకుండా వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు. 100 మందికి పైగా వలంటీర్లు కేసీఆర్ యాత్ర పొడవునా వాహన శ్రేణి వెంట ఉంటారు. ఇప్పటికే ఎంపికైన వారికి సోమవారం తెలంగాణ భవన్లో అవగాహన కల్పించారు.
తెలంగాణ భవన్ నుంచి వెళ్లనున్న కేసీఆర్
తొలిరోజైన బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్కు చేరుకుంటా రు. అక్కడున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ క్యాడర్, నేతలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తొలి రోడ్షోలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో నిలబడేందుకు, దూరం నుం చి ప్రసంగం వినడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు స్పష్టంగా భారీ స్పందన ఉంటుందని భావిస్తున్నారు.