Minister Komatireddy | నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా ప్రాజెక్టులను కేసీఆరే కేఆర్ఎంబీకి అప్పగించారని, దానిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ఆర్అండ్బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నల్లగొండకు రావాలని పేర్కొన్నారు. లేకుంటే నల్లగొండ ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిన కేసీఆర్ నల్లగొండకు వచ్చి మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ఏదైనా జరిగితే తమకు గానీ, ప్రభుత్వానికి గానీ సంబంధం లేదని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్లతో కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. గజ్వేల్ లోని కేసీఆర్ ఫామ్హౌస్కు మాత్రమే నీళ్లు వచ్చాయని, కాళేశ్వరంతో కొత్తగా ఆయకట్టు పెరగలేదని విమర్శించారు.
మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయిందని, త్వరలోనే సుందిళ్ల, అన్నారం కూడా కూలిపోతాయని, హరీశ్రావు జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాల విషయంలో కేసీఆర్పై కేసులు నమోదు అవుతాయని తెలిపారు. కవితను కేసుల నుంచి తప్పించేందుకు కేంద్రంతో కేసీఆర్ కుమ్మక్కై పాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. యాదాద్రి పవర్ప్లాంట్తోనూ దోచుకున్నారని, జగదీశ్రెడ్డి సంగతి కూడా తేలుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం కంటే ముందు చేపట్టిన డిండి ప్రాజెక్ట్ను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జగన్తో కుమ్మక్కై రాయలసీమ జల దోపిడీకి సహకరించి, రాష్ర్టాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే జనం బీఆరెఎస్ను చావగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, నల్లగొండ జిల్లాలో రెండు లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. డిపాజిట్ వస్తే తన పేరు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాదని సవాలు విసిరారు.