హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ దుష్ట, దుర్మార్గ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలముందు బలంగా ఎండగట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ రాక్షస క్రీడను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తూ బీజేపీ దళారులు అడ్డంగా దొరికిపోయిన వీడియోలనే ప్రచారాస్ర్తాలుగా చేసుకొని మోదీ-షా బండారాన్ని బయటపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో కమల్ఫైల్స్ వీడియోలను ప్రదర్శించి బీజేపీ అసలు రంగును బయటపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం స్వయంగా సీఎం కేసీఆరే 60-70 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో ఆ రెండు రాష్ర్టాల్లో పర్యటించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ బృందం గుజరాత్లో పర్యటించి భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటుచేసి కమల్ఫైల్స్ వీడియోలను ప్రదర్శించనున్నట్టు వెల్లడించాయి.
దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బీజేపీ దుష్ట రాజకీయ నీతి అర్థమయ్యేలా చెప్పేందుకు కమల్ఫైల్స్ వీడియోలను దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. ఆ పని ఇప్పటికే మొదలైందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ వీడియోలను దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఓ రోడ్మ్యాప్ కమిటీని కూడా నియమించినట్టు తెలిసింది. ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఈ వీడియోలను ప్రదర్శించి బీజేపీ బండారాన్ని ఎండగట్టాలనే ప్రణాళికను ఈ కమిటీ రూపొందిస్తుంది. అందులో భాగంగా ముందుగా గుజరాత్లో పర్యటించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఎమ్మెల్యేల బృందం హిమాచల్ప్రదేశ్లో పర్యటించనున్నది. ఈ వీడియోలను ఇప్పటికే అన్ని రాష్ర్టాల సీఎస్లు, డీజీపీలు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపినట్టు స్వయంగా కేసీఆరే గురువారం వెల్లడించారు. అదే సమయంలో సామాన్య జనంలోకి కూడా అవి వెళ్లినప్పుడే బీజేపీ దుర్మార్గాలు దేశానికి అర్థమవుతాయని సీఎం భావిస్తున్నారు. అందుకోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ వ్యతిరేక మేధావి వర్గాన్ని ఈ ఉధ్యమంలో భాగం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.