హైదరాబాద్ : రాజకీయ కక్షలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ను అరెస్టు చేసిందని బీఆర్ఎస్ ఎంపీలు(BRS MPs) నామా నాగేశ్వర్రావు, సురేష్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర , మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా కవితను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. శివసేన పార్టీపై కూడా గతంలో బీజేపీ కుట్రలు కూడా చూసిందని ఆరోపించారు.
బీజేపీకి లొంగని రాష్ట్ర ప్రభుత్వాలపై ఈడీ దాడుల(ED Raids) కు పాల్పడి భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు చేసుకుంటుందని, లిక్కర్ పాలసీ(Liqour Policy) లోనూ చేసిన మార్పులకు కవితను భాగస్వామ్యం చేయడం రాజకీయ కక్షపూరితమేనని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి పార్టీకి లొంగని పార్టీలపై ఈడీ దాడులు చేయిస్తూ అరెస్టులకు పాల్పడుతుందని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిందని, ముఖ్యంగా రైతుల కోసం అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసిందన్నారు. కవిత అక్రమ అరెస్టుమై మాట్లాడుతూ కోర్టులో కవితకు న్యాయం జరుగుతుందని, ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత నిందితురాలు కాదని, బాధితురాలని అన్నారు. కవిత బయటకు వస్తుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని, బీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు.