‘నన్ను కనీసం సంప్రదించకుండా.. నన్ను ప్రశ్నించకుండా.. నేను మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానని ఎలా ఆరోపిస్తారు? నన్ను ఈ నెలలోనే మొదటిసారి విచారణకు పిలిచారు. అలాంటప్పుడు గత నవంబర్లోనే నాపై ఈ ఆరోపణలు ఎలా చేశారు?’ అని ఎమ్మెల్సీ కవిత ఈడీని నిలదీశారు. తాను విచారణకు సహకరిస్తున్నా.. ఈడీ మాత్రం దుర్బుద్ధితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగీందర్కు ఆమె లేఖ రాశారు. వరుసగా రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన కవిత.. గతంలో తాను వాడిన ఫోన్లను అధికారులకు అప్పగించారు. 10 గంటలపాటు విచారణను ఎదుర్కొన్న కవిత.. రాత్రి 9.45 గంటలకు చెదరని చిరునవ్వుతో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వరుసగా రెండో రోజు.. మళ్లీ ఏకధాటిగా పది గంటలపాటు విచారణ.. అయినా ఎమ్మెల్సీ కవిత మొఖంలో అలుపులేదు.. చిరునవ్వు చెరిగిపోలేదు. ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లారో.. అంతే ఉత్సాహంగా విజయచిహ్నం చూపిస్తూ బయటకు వచ్చారు. ఈడీ కార్యాలయానికి వెళ్తూ ఉదయం తన మొబైల్ ఫోన్లను బహిరంగంగా ప్రదర్శించి, ఆపై ఈడీకి అప్పగించడం ద్వారా ఎంత సంచలనం సృష్టించారో.. పది గంటల విచారణ అనంతరం రాత్రి 9:40 గంటలకు చిరునవ్వుతో బయటికి వచ్చి అంతకన్నా సంచలనం సృష్టించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత మూడోసారి మంగళవారం ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో వాడిన సెల్ఫోన్లను రెండు కవర్లలో తీసుకొచ్చి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. ఇది ఈడీ తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు చెంపపెట్టులా కనిపించింది. ఆమె ఉదయం 11.35 గంటలకు ఈడీ కార్యాలయంలో అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆమె ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఇలాంటి విచారణలు, తప్పుడు ఆరోపణలు తనను ఏమీ చేయలేవనట్టుగా ఆమె చిరునవ్వులు చిందించారు. సుమారు పది గంటల విచారణ అనంతరం రాత్రి 9.40 గంటలకు ఆమె బయటకు వచ్చారు. అప్పుడు కూడా ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. అందరికీ అభివాదం చేస్తూ ‘విజయం మనదే’ అన్నట్టుగా పిడికిలి ఎత్తి, విజయచిహ్నాన్ని చూపుతూ కారు ఎక్కారు. నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డు నుంచి తుగ్లక్ రోడ్డు దాకా కవిత అభిమానులు, భారత జాగృతి నాయకులు, కార్యకర్తలు అనుసరించారు. ‘జై కవిత’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కవితను అరెస్ట్ చేస్తారంటూ సోమవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు, అదనపు బలగాల హడావుడి చూసి చాలామంది ఇదే విధంగా భ్రమపడ్దారు. మంగళవారం కూడా ఇదే హైడ్రామా కొనసాగింది. ఇటు ఈడీ ఆఫీస్ ముందు మరోసారి 144 సెక్షన్ కొనసాగించిన అధికారులు.. అటు సీఎం కేసీఆర్ అధికార నివాసం ముందు బలగాలు మోహరించారు. తెలంగాణలోని కేంద్ర కార్యాలయాల ముందు భద్రత పెంచుతున్నారన్న వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈడీ ఆఫీస్ ముందు కేంద్ర బలగాలను మోహరించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో కవిత అరెస్ట్ అవుతారంటూ మళ్లీ హైడ్రామా మొదలైంది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా అనేక రకాలుగా ప్రచారం జరిగింది. సాయంత్రం ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో ఈ ప్రచారం తారాస్థాయికి చేరుకున్నది. కానీ అవన్నీ గాలివార్తలేనని కవిత బయటకు రావడంతో తేటతెల్లమైంది. విచారణ ముగిసిందా? మళ్లీ హాజరు కావాలా? ఎప్పుడు రావాలి? వంటివాటిపై ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్పినట్టు తెలిసింది.
‘నన్ను కనీసం సంప్రదించకుండా.. నన్ను ప్రశ్నించకుండా.. నేను మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానని ఎలా ఆరోపిస్తారు?’ అని ఎమ్మెల్సీ కవిత ఈడీని నిలదీశారు. కేవలం బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకే.. తనకు, తన పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేందుకే ఈడీ ఇలాంటి చర్యలకు దిగిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్కు లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టారు. తాను విచారణకు సహకరిస్తున్నా.. ఈడీ మాత్రం దుర్బుద్ధితో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మం డిపడ్డారు. తనను మార్చిలో తొలిసారి విచారణకు పిలిచారని గుర్తు చేస్తూ.. నవంబర్లో ఎలా ఆరోపణలు చేస్తారని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థ స్వతంత్రతను బలిపీఠంపై పెట్టారని మండిపడ్డారు.