MLC Kavitha | ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక మహిళను, ఉద్యమ నేతను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంపీయే స్వయంగా అవమానిస్తే… ‘నేను మహిళను. మహిళల కోసమే నేనున్నా!’ అని గొంతు చించుకుంటున్న తమిళిసై రాజ్భవన్ తలుపులు తెరుచుకోలేదు. కనీసం దర్శనమివ్వడానికీ మనసు కనికరించలేదు. ఇది గవర్నర్ మార్కు ప్రజాస్వామ్యం!
దర్యాప్తు సంస్థలు అడగగానే సీబీఐ అధికారులను ఇంటికి పిలిచి, ఈడీ అధికారుల ముందుకు వెళ్లి, ప్రశ్నలకు జవాబిచ్చి చిరునవ్వుతో బయటకొచ్చిన కవిత ఒకవైపు! తాము నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఎక్కే కడప దిగే కడపగా కోర్టుల చుట్టూ తిరిగి, పిటిషన్ల మీద పిటిషన్లు వేసి, అప్పీళ్ల మీద అప్పీళ్లు చేసి, సిట్ ముందు హాజరు కాకుండా తప్పించుకున్న బీజేపీ ముఖ్యనేత బీఎల్ సంతోష్ మరోవైపు! ఇది బీజేపీ మార్కు ధర్మం!
74 ఏండ్ల లాలూ, కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగి మూడు నెలలైనా కాలేదు. ఆయన కోడలు నిండు గర్భిణి. ఆమెను 15 గంటలు కదలకుండా కూర్చోబెట్టి విచారించడం అవసరమా? అనిపించలేదు. 15 ఏండ్ల కిందటి పాత కేసును తవ్వడమెందుకనే వివేచన లేదు. వీగిపోయిన కేసును మళ్లీ తెరవడం ఎందుకనే విచక్షణ లేదు. విపక్షాల నిర్మూలనే లక్ష్యంగా,కేంద్ర దర్యాప్తు సంస్థలే అస్త్రంగా, ప్రశ్నించిన నేతల కుటుంబ సభ్యులే టార్గెట్గా, దేశం కోసం అడిగిన ప్రశ్నలకు ద్వేషమే జవాబుగా వినిపిస్తున్న పరిస్థితి. ఇది మోదీ మార్కు పరిపాలన!
కేసులు, దర్యాప్తులు, ఎకసెక్కాలు, చిక్కులు, ఆరోపణలు, అవహేళనలు తెలంగాణకు కొత్తకాదు. ఉద్యమం అంతకన్నా ఎక్కువే నేర్పింది. కష్టం నుంచి కష్టానికి చిరునవ్వుతో ప్రయాణించి, చిట్టచివరికి చిక్కటి విజయంతో బయటకు రావడం తెలంగాణ నేతలకు అలవాటే. 9 గంటల ఈడీ విచారణ తర్వాత కవిత మొహంపై చెరగని, చెదరని చిరునవ్వే ఇందుకు రుజువు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది. నవ్వుతూ విచారణకు వెళ్లిన కవిత, 9 గంటల విచారణ అనంతరం కూడా నవ్వుతూనే బయటకు వచ్చారు. కవితకు బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు దిష్టితీసి స్వాగతం పలికారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరవ్వాలని ఈడీ నోటీసు ఇచ్చినట్టు తెలిసింది.
విచారణ కోసం శనివారం ఉదయం 11 గంటలకే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకొన్నారు. ఎస్కార్ట్ వాహనంలో ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 గంటలపాటు ఈడీ జాయింట్ డైరెక్టర్, ఒక మహిళా డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడిన బృందం ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద విచారణ కొనసాగింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకొన్నారు. అక్కడ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. మంగళ హారుతులు ఇచ్చారు. ఆ తరువాత మంత్రులు కేటీఆర్, హరీశ్రావుసహఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొన్నారు. విచారణ సందర్భంగా కేసీఆర్ నివాసంతోపాటు ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులతోపాటు పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ఈ కేసులో గత డిసెంబర్లోనే కవితను సీబీఐ విచారించింది. ఇదే కేసులో ఢిల్లీ డిఫ్యూటీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు.
తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. శనివారం ఈ మార్గం మొత్తం బారికేడ్లతో నింపేశారు. కేసీఆర్ నివాసం నుంచి ఎవరూ బయటకు రాకుండా ఢిల్లీ పోలీసులు బారికేడ్లతో అడ్డుకొన్నారు. ఈడీ కార్యాలయానికి కిలోమీటర్ దూరం నుంచే బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, భారత జాగృతి కార్యకర్తలు, నేతలు ఆ ప్రదేశానికి చేరుకొని సీఎం కేసీఆర్కు, కవితకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చేవరకు అక్కడే వేచి ఉన్నారు. ఉదయం కవిత విచారణకు వెళ్లే సమయంలో సీఎం కేసీఆర్ ఇంటి నుంచి ఈడీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు, జాగృతి శ్రేణులు ఆమెకు సంఘీభావంగా నిలిచారు. విచారణ అనంతరం రాత్రి 8 గంటలకు ఆమె బయటికి రాగానే ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. జై తెలంగాణ.. జై జాగృతి’ అనే నినాదాలు మిన్నంటాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎంపీలు వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, తాతా మధు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, క్రాంతికిరణ్, జాజుల సురేందర్, నోముల భగత్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, మేడె రాజీవ్సాగర్, ఒంటేరు ప్రతాప్రెడ్డి, అయాచితం శ్రీధర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి తదితరులు ఆమె విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉన్నారు.
రాజకీయ ప్రముఖుల విచారణ సందర్భంగా తరుచూ మీడియాకు లీకులిస్తూ గందరగోళపర్చే ఈడీ, కవిత విచారణ అనంతరం కూడా అదే పని చేసింది. వాస్తవానికి విచారణలో ఏదైనా కీలక సమాచారం లభిస్తే స్వయంగా ఈడీనే అధికారికంగా మీడియాకు వెళ్లడించాలి. కానీ, శనివారం సాయంత్రం కొన్ని జాతీయ మీడియా సంస్థలకు పలు లీకులు వదిలింది. ‘ఎమ్మెల్సీ కవిత విచారణలో పలు కీలక విషయాలు రాబట్టారు’ అని ఈడీని ఉటంకిస్తూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు వస్తు న్న ఆదరణ చూసి బీజేపీ వాళ్లు ఓర్వలేక పోతున్నారు. కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. దేశంలో అనేకమం ది సీఎంలు, మంత్రుల మీదా ఇలాంటి దాడులే చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన పిచ్చి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలి.
-కొప్పుల ఈశ్వర్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఐటీ, ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు బీజీపీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయి. మోదీ ఏది చెబితే అదే చేస్తున్నాయి. బీజేపీ నాయకుల అసలు రూ పం బండి మాటలతో బయటపడింది. బాధ్యత కలిగిన ఎంపీ హోదాలో ఉన్న బండి వాఖ్యలు.. సీఎం కేసీఆర్ కుటుంబంపై బీజేపీకి ఉన్న విద్వేషాన్ని తెలియజేస్తున్నాయి. దేశంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్నందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారు. తెలంగాణలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా నేనున్నానని ప్రకటించే గవర్నర్.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలను ఖండించాలి. బండి క్షమాపణ చెప్పే వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిరసనలు కొనసాగిస్తాం.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. బీజేపీ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ సీ ఎం కేసీఆర్పై కేం ద్రం కక్ష కట్టింది. అందులో భాగంగా నే బీఆర్ఎస్ నేత ల పై దాడులకు పాల్పడుతున్నది. ఎమ్మె ల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి.
-కొండూరి సత్యనారాయణ, ఎంబీసీ సంఘాల సమితి కో కన్వీనర్