శ్రీశైలం : శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ ఈవో లవన్న మాట్లాడుతూ.. కార్తీక మాసోత్సవాల నిర్వహణ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు, కార్తీకమాస శివరాత్రి, ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక పాతాళగంగ వద్ద ఉన్న శౌచలాయాలు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులతో పాటు మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ 8వ తేదీన చంద్రగహణం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయన్నారు. ఆ రోజున అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య స్వామి, జీఎం విజయలక్ష్మి సుబ్బరాయుడు, మధుసూదన్ రెడ్డి, బరుగురెడ్డి పద్మజా, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక(స్థానాచార్యులు) అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.