శ్రీశైలం : మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్తీకమాసం చివరిరోజు అమావాస్య సందర్బంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు గుజరాత్,కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుండి తరలివచ్చిన భక్తులతో మల్లన్న క్షేత్రం బుధవారం సందడిగా మారింది. అందులోను అమావాస్య కావడంవల్ల తెల్లవారుజాము నుండి నదీ స్నానాలు చేసుకుని స్వామిఅమ్మవార్ల దర్శనాలకు బారులుదీరారు. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పట్టగా, శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం శ్రీశైలం క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి శుద్దజలాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు శాస్ర్తోక్త పూజలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
కార్తీక మాసం సందర్భంగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన ఆర్జితసేవలన్నీ గురువారం నుండి భక్తులకు అందుబాటులో ఉంటాయని ఈవో లవన్న ప్రకటించారు. సామూహిక అభిషేకాలు, గర్బాలయ అభిషేకాలు, స్పర్శదర్శనము, అమ్మవారికి కుంకుమార్చనలు యదాతథంగా జరిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే యాత్రికులకు ఆన్లైన్ ద్వారా, క్యూలైన్ల వద్ద గల టిక్కెట్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లతోపాటు పరివార దేవతలకు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయని ఈవో లవన్న తెలిపారు. అందులో భాగంగా బుధవారం ఉదయం సాక్షి గణపతికి పంచామృత ఉదకాభిషేకాలు పుష్పార్చనలు హోమాలు జరిపించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న అఘోర వీరభద్రస్వామికి ప్రదోషకాల షోడశోపచార క్రతువులను నిర్వహించారు. మల్లికాగుండంలోని శుధ్ద జలాలతో స్వామివారికి ప్రత్యేకాభిషేకం జరిపించారు.
శ్రీశైలం క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించకుండా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధికారులకు సూచనలిచ్చారు. బుధవారం ఉదయం ఇంజనీరింగ్ అధికాలతో కలిసి పాతాళగంగ వద్ద గల నందికేశ సదనంలో శివసేవకుల కోసం చేపట్టిన పనులను, నూతన శౌచాలయాలు వంటి అత్యవసర మౌలిక వసతులను పరిశీలించారు. ప్రధానంగా ఇటీవల చేపడుతున్న నిర్మాణ పనుల నాణ్యతలో రాజీపడవద్దని లలితాంబికా వాణిజ్య సముదాయం విభాగ నిర్మాణం భావితరాలకు నిలిచిపోయే విధంగా ఉండాలని గుత్తేదారులకు చెప్పారు.