హైరదాబాద్: రాష్ట్రంలోని శైవాలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. కార్తిక మాసం (Karthika masam) ప్రారంభంకావడంతో ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి త్రినేత్రుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అలంపూర్లోని జోగులాంబ ఆలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక మాస పూజలు నిర్వహిస్తున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో కార్తిక శోభ నెలకొన్నది. జోగులాంబ ఆలయంలో కార్తిక దీపాలను వెలిగిస్తున్నారు. ములవాడ రాజరాజేశ్వరుని సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కార్తిక మాసం ఆరంభంకావడంతో రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.