Yadadri | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా స్వామి వ్రతాలు కనుల పండువగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ప్రతి రోజూ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొండకింద ఘాట్ రోడ్డు పక్కన గల నూతన వ్రత మండపంలో 6 బ్యాచ్లుగా నిర్వహిస్తామన్నారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27న ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్లుగా, పాతగుట్ట ఆలయంలో 5 బ్యాచ్లుగా వత్రాలు జరుగనున్నట్లు తెలిపారు. భక్తులు నేరుగా వ్రత మండపం వద్ద కౌంటర్లలో గానీ, https://yadadritemple.telangana.gov.inలో గానీ టికెట్లను బుక్ చేసుకునే వీలుందన్నారు. దీపారాధన కోసం కొండపైన మాఢ వీధులు, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండకింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి చెంతన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగించుకోవాలని సూచించారు.