Karnataka | కరెంటు కోతలు ఒకవైపు.. కరువు రక్కసి మరోవైపు.. రైతన్న బలవన్మరణాలు ఒకవైపు.. ప్రజల హాహాకారాలు మరోవైపు.. ఇవేమీ పట్టించుకోకుండా.. నోట్ల వర్షంలో మంత్రిగారి జల్సాలు ఆ మంత్రి ఎవరో కాదండోయ్..రైతుల ఆత్మహత్యలను కూడా నాటకంగా చిత్రీకరించిన శివానంద్ పాటిల్..ఐదు నెలల్లో కర్ణాటకను కాంగ్రెస్ ఎలా భ్రష్టుపట్టించిందో ఈ ఉదాహరణలు చాలేమో!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) బెంగళూరు(నమస్తే తెలంగాణ): కరెంటు కోతలతో కన్నడ ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్తు కోతలతో ఎండిన పంటలు చూడలేక రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అట్టపెట్టెల్లో దొరుకుతున్న కోట్ల కట్టలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఐదు నెలల్లోనే కర్ణాటకను కకావికలం చేసిన కాంగ్రెస్ నేతలు మాత్రం కరెన్సీ నోట్ల వర్షంలో జల్సా చేసుకొంటున్నారు. హాహాకారాలు చేస్తున్న ప్రజల బాధలను పట్టించుకోకుండా.. విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు.
మంత్రి ఉల్లాసం ఇలా..
గుల్బర్గా కాంగ్రెస్ నాయకుడు అయాజ్ఖాన్ కుమారుడి వివాహ వేడుక గత ఆదివారం హైదరాబాద్లో జరిగింది. దీనికి కర్ణాటక చెరుకు అభివృద్ధిశాఖ మంత్రి శివానంద్ పాటిల్ హాజరయ్యారు. వేడుకలో హాజరైన మంత్రిపై అక్కడి ఓ గుంపు రూ. 500 నోట్లను ఎగురవేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందపడ్డ కరెన్సీ నోట్ల మీదనే మంత్రి దర్జాగా కాళ్లు పెట్టుకోవడం విమర్శలకు దారితీస్తున్నది.
నేనేమైనా నోట్లు విసిరానా?? జస్ట్, కూర్చున్నా..
నోట్లవర్షంలో మంత్రి తడవడంపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీలు మండిపడ్డాయి. కర్ణాటకలో కలెక్షన్ బిజినెస్ను చేసి, మంత్రిగారు ఇలా కరెన్సీ వర్షంలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తాయి. ‘రాష్ట్ర ప్రజల సొత్తును లూటీ చేసి, ఎలా సేదతీరాలో మంత్రి శివానంద్ చక్కని షో వేసి చూపించారు’ అంటూ బీజేపీ ఎక్స్ వేదికపై చురకలు అంటించింది. సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో శివానంద్ ఎట్టకేలకు స్పందించారు. తానేమీ కరెన్సీని వెదజల్లలేదని, పెండ్లి వేడుకలో కూర్చొనిఉండగా అలా జరిగిపోయిందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించగా.. ఈ విషయంపై సదరు మంత్రిని అడిగి వివరాలు తెలుసుకుంటానన్నారు.
ఎక్కువ పరిహారం కోసమే నాటకాలు!
వివాదాల్లో చిక్కుకోవడం మంత్రి శివానందకు కొత్తేంకాదు. రైతుల ఆత్మహత్యలపై కూడా ఆయన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా లేదా వేర్వేరు కారణాలతో జరిగిన రైతుల మరణాలను ఆత్మహత్యలుగానే చిత్రీకరిస్తూ కొందరు రైతుసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని శివానంద్ గతనెలలో ఆరోపించారు. బాధిత రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రభుత్వం నుంచి అందడమే దీనికి కారణమని చెప్పుకొచ్చిన ఆయన.. ఎక్కువ మొత్తంలో పరిహారాన్ని రాబట్టడానికే రైతు నేతలు ఇలా చేస్తున్నట్టు వెల్లడించారు.