విజయపుర: బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలలోపు సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని తెలిపారు. 25 మంది పాలకపక్ష ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘30 మంది ఎమ్మెల్యేలు బయటికొస్తే ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పుడు 25 మంది సిద్ధంగా ఉన్నారు. కొందరు మంత్రులు తమకే అన్ని అధికారాలున్నట్టు ప్రవర్తిస్తున్నారు’ అని ఓ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకులకు కావాల్సింది డబ్బేనని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింగపూర్లో కుట్ర జరిగిందని ఇటీవల డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో యత్నాల్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది.