హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఉన్న ఒక పోస్టు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరులోని బిల్డర్లు, రియల్ సంస్థల ప్రతినిధుల నుంచి చదరపు అడుగుకు రూ.500 చొప్పున గైడ్ వాల్యూ ట్యాక్స్ రూపంలో ముక్కు పిండి వసూలు చేశారు.
ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం కొన్నిరోజుల కిందట సంచనలం కలిగించింది. ఇదే తరుణంలో బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో ఓ కార్పొరేటర్ ఇంట్లో ఏకంగా రూ.42 కోట్లు లభించాయి. తెలంగాణ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ భారీ మొత్తాన్ని సమీకరించిందని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్ నారాయణ బహిరంగంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే తరహాలో అనధికారికంగా గైడ్ వాల్యూ టాక్స్ను వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.