పాలమూరు సరిహద్దుల్లో 11 చెక్ పోస్టుల ఏర్పాటు
మహబూబ్నగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దుల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వడ్లు తరలించకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్ణాటకలోని రాయిచూరు, యాద్గీర్ జిల్లాల నుంచి కొందరు అక్రమార్కులు వడ్లను తెలంగాణ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్రమత్తమైన అధికారులు నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల సరిహద్దులో చెక్పోస్టులతో నిఘా పెట్టనున్నారు. నారాయణపేట జిల్లాలోని జలాల్పూర్, దామరగిద్ద మండలం కాన్కుర్తి, కృష్ణ మండలం టైరోడ్, చేగుంట, ఉట్కూరు మండలం సమస్తిపూర్, మాగనూరు మండలం ఉజ్జెల్లి వద్ద చెక్ పోస్టులను ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలం బల్గెర వద్ద, అలంపూర్ న్యూబ్రిడ్జి, పుల్లూరు టోల్ ప్లాజా, రాజోళి వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఉమ్మడిగా ఈ చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించనున్నారు.