హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బహుజన వర్గాలకు చెందిన 43 ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం విప్లవాత్మక చర్య అని కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని అసాధారణ నిర్ణయాన్ని కేసీఆర్ ఆచరణాత్మకంగా చేసి చూపారని ప్రశంసించారు.
ఉప్పల్ భగాయత్లోని తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. బీసీల అభ్యున్నతి, ఆత్మగౌరవ భవనాలకు ఏ ముఖ్యమంత్రి ఇంతగా చేయలేదని కొనియాడారు.
భవనాలు పూర్తయితే దేశానికి దిక్సూచిలా నిలుస్తాయని చెప్పారు. 43 భవనాలకు 60 ఎకరాల స్థలం, రూ.90 కోట్ల బడ్జెట్ను కేటాయించడం బహుజన వర్గాలకు సంతోషదాయకమని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటుచేసినట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ శ్రీనివాసాచారికి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వకర్మ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ లాలుకోట వెంకటాచారి, కార్యదర్శి బొడ్డుపల్లి నరేందర్, ఉపాధ్యక్షుడు మదన్మోహన్, కుందారపు గణేశ్, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్ బాలచారి తదితరులు పాల్గొన్నారు.