DK Shivakumar | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు చాలామందికి తెలియదు. కానీ.. డీకే శివకుమార్ అంటే మాత్రం చాలామంది కర్ణాటక డిఫ్యూటీ సీఎం అని టక్కున చెప్పేస్తారు. అవును.. డీకే శివకుమార్ పూర్తిపేరు అది. కర్ణాటకలో పేరుమోసిన కాంగ్రెస్ నేత అయిన డీకేఎస్.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీలిస్తున్నారు. కానీ, కర్ణాటకలో గెలిపిస్తే ఏం చేశారో చాలామందికి తెలియదు కదా! కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై చాలా కేసులే ఉన్నాయి. మనీలాండరింగ్, అక్రమ మైనింగ్ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. పన్నుల ఎగవేత కేసులో ఈయన ఆస్తులపై 2017లోనే ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. లెక్కల్లో చూపని కట్టలకొద్దీ డబ్బును స్వాధీనం చేసుకోవటం అప్పుట్లో సంచలనం సృష్టించింది.
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2019లో శివకుమార్ను అరెస్టు చేసింది. శివకుమార్ ప్రభుత్వం వద్ద అడ్డికి పావుశేరుకాడికి ఇనుపఖనిజం కొని భారీ లాభాలకు అమ్ముకొన్నారని సమాజ్ పరివర్తన్ సముదాయ (ఎస్పీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో కేసు (రిట్ పిటిషన్ నంబర్ 562 ఆఫ్ 2009) వేసింది. దాదాపు 9 లక్షల టన్నుల అత్యంత నాణ్యమైన ఇనుపఖనిజాన్ని నాణ్యత లేని ఖనిజంగా చూపుతూ ఈయన టన్నుకు రూ.15కే కొన్నాడని ఆరోపణ. సింగిల్ చాయ్ ధరకు టన్ను ఖనిజం కొని వేరే కంపెనీలకు వేల రూపాయలకు అమ్ముకొన్నారని సదరు సంస్థ ఆరోపించింది. డీకే శివకుమార్ అక్రమాస్తులు కలిగి ఉన్నారని సీబీఐ ఇప్పటికీ దర్యాప్తు జరుపుతున్నది. 2013-18 మధ్య ఆయన వద్ద లెక్కల్లో చూపని డబ్బు రూ.74.93 కోట్లు దొరికిందని సీబీఐ ఆరోపణ.
ఇటీవల బెంగళూరులో రెండుచోట్ల ఐటీ అధికారులకు దొరిన రూ.70 కోట్లు కూడా శివకుమార్వేనని వార్తలు వచ్చాయి. ఆ డబ్బు శివకుమార్ అనుచరుల వద్దనే లభించటం గమనార్హం. ఆ సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఖర్చు పెట్టేందుకే సిద్ధంచేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. నాలుగు నెలల క్రితం కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో డీకే శివకుమార్కు డిఫ్యూటీ సీఎం హోదా లభించింది. ఆ వెంటనే ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. కాంట్రాక్టర్ల నుంచి స్వయంగా శివకుమారే 50 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఉద్ధరిస్తానని కబుర్లు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు నీతులు చెప్తున్నారు.