TS Minister Gangula | కరీంనగర్ నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటకుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఆదివారం ఆయన తెలంగాణ చౌక్లో రూ.1.20 కోట్లతో ఆధునీకరించిన అత్యాధునిక ఐలాండ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నామన్నారు.
వేలకోట్ల నిధులతో కరీంనగర్ అభివృద్ధి చేస్తున్నామని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో అద్భుతమైన రోడ్లు జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గతంలో కరీంనగర్ చీకటిగా మయంగా గుడ్డిదీపంగా ఉండేదన్నారు. కానీ తాము నగరమంతా వెలుగులు నింపాలని తొలిసారి రూ.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. గతంలో జంక్షన్లు చిన్నగా అంద హీనంగా ఉండేవన్నారు. జంక్షన్లను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రూ.8 కోట్ల నిధులతో 13 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, హెచ్ కే ఆర్ రోడ్, సదాశివ్ పల్లి, గాంధీ రోడ్, బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా, మాతా శిశు ఐలాండ్ లను ప్రారంభించుకున్నామని గంగుల కమలాకర్ అన్నారు. మరో ఆరు చౌరస్తాల సుందరీకరణకు టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. కోతి రాంపూర్ చౌరస్తా, సిక్కువాడి, నాక చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు. జంక్షన్ల నిర్మాణం పూర్తయితే రాత్రి వేళ నగరం మరింత సుందరంగా కనబడుతుందన్నారు.
మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా రూ.224 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టంతో కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించామని మంత్రి గంగుల అన్నారు. వచ్చే ఆగస్టు 15 వరకు మన రివర్ ఫండ్ మొదటి దశ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ , కార్పొరేటర్లు వాలా రమణారావు, అఖిల్ ఫిరోజ్ బోనాల శ్రీకాంత్, పిట్టల శ్రీనివాస్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ శమి, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు.